Revanth Reddy: ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy on Loan Waiver

  • 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ హామీని అమలు చేస్తున్నామన్న సీఎం
  • పార్టీకి నష్టమని తెలిసినా సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని వెల్లడి
  • కేసీఆర్ లాగా మాటలు చెప్పి మభ్యపెట్టడం లేదన్న రేవంత్ రెడ్డి

రైతులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రేపు రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నామని, ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో భేటీ నేపథ్యంలో బుధవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు.

పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారన్నారు. ఆగస్ట్ 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు. ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని... ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారని పేర్కొన్నారు. అయినప్పటికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు.

పార్టీకి నష్టమని తెలిసినా సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమే అన్నారు.
రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అన్నారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్నారు.

వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలని పేర్కొన్నారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయన్నారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్ట్‌లో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కేసీఆర్ లాగా మాటలు చెప్పి మభ్యపెట్టడం లేదు

రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను తాము మభ్యపెట్టడం లేదన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని తెలిపారు.

మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కేడర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 'రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి..
రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి' అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు.

గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్‌లో చెప్పండి

రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్‌లో ఎంపీలు ప్రస్తావించాలని సూచించారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని... ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News