Jubilee Hills: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓ కిడ్నాప్.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

Techie kidnapped in jubilee hills police locate victim in 5 hours

  • జూబ్లీహిల్స్‌లో వెలుగు చూసిన ఘటన
  • టీహబ్ సమీపంలో టెక్ సంస్థ నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
  • కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగుల నియామకం, జనవరి నుంచి జీతాలు చెల్లించని వైనం
  • ఈ నెల 9న టెకీని కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది
  • ఐదు గంటల్లో నిందితుల ఆచూకీ గుర్తించిన పోలీసులు

నగరంలోని ఓ కిడ్నాప్ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఐదుగంటల్లోనే ఛేదించారు. నిందితులను గుర్తించి వారి చెర నుంచి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్‌లోని హుడా ఎన్‌క్లేవ్ నందగిరిహిల్స్‌లో వాకటి రవిచంద్రారెడ్డి ఉంటున్నారు. ఆయన టీ-హబ్ సమీపంలోని ఆర్బిట్‌మాల్‌లో ‘గిగ్లైజ్’ పేరుతో గత నవంబరులో సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రారంభించారు. కన్సల్టెన్సీల ద్వారా 1500 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి దశలవారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కొన్నినెలల పాటు వారికి సక్రమంగా జీతాలు చెల్లించి జనవరి నుంచి చెల్లించడం లేదు. 

ఇదిలా ఉంటే, ఈ నెల 9న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి ఎనిమిది మంది కన్సల్టింగ్ సిబ్బంది వచ్చారు. కాసేపు మాట్లాడాక వారు రవిచంద్రారెడ్డి అతడి స్నేహితుడు మొహన్‌ను బలవంతంగా కార్లలో తీసుకెళ్లారు. 

నగరంలో పలు ప్రాంతాలు తిప్పి చివరకు నాగర్‌‌కర్నూల్ జిల్లా ఒంగూరులోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. అంతకుముందే మూత్రవిసర్జన పేరుతో మోహన్ కారులోంచి దిగి పారిపోయాడు. మరోవైపు, కుమారుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో రవిచంద్రారెడ్డి తల్లి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి 10 గంటలకల్లా నిందితులున్న ప్రాంతాన్ని గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వీరితో పాటు 82 ల్యాప్‌టాప్‌లు, కొన్ని ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. తనను నిందితులు కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డట్టు బాధితుడు పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న జగదీశ్, గౌతం, సుజిత్, శివ, ఆజాద్, మల్లేశ్, ప్రవీణ్, కమల్‌లు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేశారు. 

మరోవైపు, ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారంటూ సంస్థ ఉద్యోగులు శుక్రవారం ఠాణా వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ నుంచి రూ.15 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. రవిచంద్రారెడ్ది, అతడి సోదరి ఇటీవల ఎంపీ ఎన్నికల్లో లిబరేషన్ పార్టీ తరపున తమ సొమ్ముతో ఎన్నికల బరిలో నిలిచారని ఆరోపించారు. నియామకాలు చేసుకున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వని కారణంగానే మాట్లాడటానికి తీసుకెళ్లామని అరెస్ట్ అయిన కన్సల్టింగ్ కంపెనీ సిబ్బంది పోలీసులకు తెలిపారు.

  • Loading...

More Telugu News