Shabbir Ali: సీనియర్ నాయకుడిగా కేటీఆర్‌కు సవాల్ చేస్తున్నా: షబ్బీర్ అలీ

Shabbir Ali challenges KTR

  • మొదట ఫిరాయింపులకు పాల్పడింది ఎవరో చెప్పాలని నిలదీత
  • తాను చెప్పింది అబద్దమైతే పదవికి రాజీనామా చేస్తానని సవాల్  
  • లేదంటే కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్
  • నాడు కాంగ్రెస్ పార్టీని కూలగొట్టారని, ఇప్పుడు తాము బీఆర్ఎస్‌ను కూలగొడతామన్న షబ్బీర్ అలీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయన సవాల్ చేశారు. తాను కేటీఆర్ కంటే సీనియర్ నాయకుడినని... మంత్రిగా కూడా సీనియర్‌నే నన్నారు. సీనియర్ నాయకుడిగా సవాల్ చేస్తున్నానని... మొదట ఫిరాయింపులకు పాల్పడింది ఎవరు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని రాజీనామా చేయించకుండా మంత్రిని చేశారని గుర్తు చేశారు.

46 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారన్నారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురిని చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీలను కూడా అలాగే చేశారన్నారు. ఇప్పుడు చెప్పినవి వాస్తవం కాదా... నిరూపించేందుకు నేను సిద్ధం అన్నారాయన. నేను చెప్పింది అబద్దమైతే పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతా అన్నారు. తాను చెప్పిన వాటిని కేటీఆర్ రుజువు చేయాలి లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విషయానికి సంబంధించి తాను కేటీఆర్‌కు ట్వీట్ చేశానని.. కానీ తన ట్విట్టర్ అకౌంట్‌ను ఆయన బ్లాక్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అందర్నీ అంగట్లో పెట్టి కొన్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. నాడు వాళ్లు మా కాంగ్రెస్ పార్టీని కూలగొట్టారని... ఇప్పుడు తామూ బీఆర్ఎస్‌ను కూలగొడతామన్నారు. త్వరలో అందులో నుంచి అందరూ కాంగ్రెస్‌లో చేరుతారని జోస్యం చెప్పారు.

కురియన్ కమిటీ అధ్యయనం

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి ఏఐసీసీ అధిష్ఠానం కురియన్ కమిటీని నియమించింది. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో‌ రెండు రోజులుగా పలువురు కాంగ్రెస్ నేతల నుంచి వారు వివరాలు సేకరించారు. పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ విడివిడిగా మాట్లాడుతోంది. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాల సమయాన్ని కమిటీ కేటాయించింది. ఈరోజు కురియన్ కమిటీతో షబ్బీర్ అలీ భేటీ అయ్యారు.

కురియన్ కమిటీతో భేటీ అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ...అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోని ఓట్ల తేడాను అడిగినట్లు చెప్పారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి గల కారణాలను అడిగారన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్‌కు 17 వేల మెజార్టీ వచ్చినట్లు చెప్పానన్నారు. కామారెడ్డిలో పార్లమెంట్, అసెంబ్లీలో వచ్చిన మెజార్టీని వారికి వివరించినట్లు చెప్పారు. పోలింగ్ బూత్‌ల నుంచి బీఆర్ఎస్ ఏజెంట్లు ఉదయం నుంచే బయటకు వెళ్లిపోయినట్లు చెప్పానన్నారు. బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి వేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాన్సువాడలో 27 వేల లీడ్ వచ్చిందని, కానీ లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి 18 వేల ఓట్లు తగ్గాయన్నారు.

  • Loading...

More Telugu News