Y.Satya Kumar Yadav: ఒకే జాతి పక్షులు ఒకరికొకరు 'సర్టిఫికెట్' లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి.. కేటీఆర్ కు ఏపీ మంత్రి సత్యకుమార్ కౌంటర్

AP minister Y Satya Kumar Yadav slams KTR

  • ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందన్న కేటీఆర్
  • ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటని వ్యాఖ్యలు
  • కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారన్న మంత్రి సత్యకుమార్

ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందని, ముఖ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని, కేతిరెడ్డి వంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో బదులిచ్చారు. 

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. 

"ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా... కలెక్షన్... కరప్షన్... కమీషన్లే! ఫాంహౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా అతడి గురించి ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు.

మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు నాలుగు సంవత్సరాల క్రితం నన్ను ఎక్స్ (ట్విట్టర్) లో బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు 'సర్టిఫికెట్' లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి" అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.

ఇటీవలి ఎన్నికల్లో సత్యకుమార్ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా ధర్మవరం నుంచి పోటీ చేసి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఓడించడం తెలిసిందే.

Y.Satya Kumar Yadav
KTR
Kethireddy
Dharmavaram
BJP
YSRCP
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News