Good Thief: ఇంటిని దోచుకుని క్షమాపణ లేఖ వదిలివెళ్లిన దొంగ.. డబ్బు, బంగారాన్ని నెల రోజుల్లో ఇచ్చేస్తానని ప్రామిస్!

Thief leaves apology note after robbing

  • తమిళనాడులోని మేగ్నానపురంలో ఘటన
  • రిటైర్డ్ టీచర్ల ఇంటిని దోచుకున్న దొంగ
  • రూ. 60 వేల నగదు, 12 గ్రాముల బంగారం చోరీ
  • ఇంట్లో ఒకరికి బాగా లేకపోవడం వల్లే చోరీ చేయాల్సి వచ్చిందని వివరణ

తమిళనాడులో ఓ టీచర్ ఇంటిని దోచేసిన దొంగ.. తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ లేఖ రాసి మరీ వెళ్లాడు. మేగ్నానపురంలోని సాతంకుళం రోడ్డులో జరిగిందీ ఘటన. 

సెల్వన్, ఆయన భార్య ఇద్దరూ రిటైర్డ్ ఉపాధ్యాయులే. చెన్నైలో ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు జూన్ 17న వెళ్లారు. అయితే, తాము లేనప్పుడు ఇంటిని నిత్యం శుభ్రం చేసేందుకు సెల్వీ అనే పని మనిషిని పెట్టుకున్నారు. జూన్ 26న ఇంటిని క్లీన్ చేసేందుకు వెళ్లిన సెల్వీ తలుపులు తెరిచి ఉండడం చూసి నిర్ఘాంతపోయింది.

వెంటనే ఆమె ఈ విషయాన్ని సెల్వన్‌కు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే వచ్చిన ఆయన ఇంట్లో దొంగలు పడినట్టు గుర్తించారు. రూ. 60 వేల నగదు, 12 గ్రాముల బంగారు నగలు, వెండిపట్టీలు దోచుకెళ్లినట్టు నిర్ధారించుకున్నారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇంటిని తనిఖీ చేస్తుండగా దొంగ విడిచిపెట్టిన క్షమాపణ లేఖ కనిపించింది. తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని దొంగ ఆ లేఖలో హామీ ఇచ్చాడు. ‘‘నన్ను క్షమించండి. మీ వస్తువులను మీకు నెల రోజుల్లో అప్పజెబుతాను. మా ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది’’ అని దొంగ ఆ లేఖలో రాసుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిరుడు కేరళలోని పాలక్కాడ్‌లో సమీపంలో ఇలాంటి ఘటనే జరిగింది. మూడేళ్ల చిన్నారి నుంచి నెక్లెస్ చోరీ చేసిన దొంగ.. ఆ తర్వాత దానిని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును క్షమాపణ లేఖతో తిరిగి ఇచ్చేశాడు.

  • Loading...

More Telugu News