Team India: ఎట్టకేలకు స్వదేశానికి పయనమైన టీమిండియా!
![Indian cricketers stranded in Barbados Hurricane Beryl board special Air India chartered flight back home](https://imgb.ap7am.com/thumbnail/cr-20240703tn668527ffd349d.jpg)
- బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లో చిక్కుకున్న టీమిండియా
- ఎయిరిండియా ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన రోహిత్ సేన
- క్రికెటర్లు, సిబ్బంది కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లో చిక్కుకున్న టీమిండియా ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి పయనమైంది. అక్కడున్న అడ్డంకులన్నీ తొలిగాక, బీసీసీఐ ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్లో బార్బడోస్ నుంచి రోహిత్ సేన ఢిల్లీకి బయలుదేరింది. వీరితో పాటు భారత్ కు చెందిన మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, కోచ్లు, మీడియా సిబ్బంది కోసం ఈ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బుధవారం సాయంత్రం బార్బడోస్ నుండి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక బీసీసీఐ కార్యదర్శి జై షా మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అటు ఏఎన్ఐ టీమిండియా ఆటగాళ్లు, సిబ్బంది బార్బడోస్లో విమానం ఎక్కుతున్న వీడియోను షేర్ చేసింది. “భారత క్రికెట్ జట్టు బార్బడోస్ నుండి బయలుదేరింది. ఈ బృందం జులై 4న తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంటుంది” అని తన 'ఎక్స్'(ట్విట్టర్) పోస్టులో రాసుకొచ్చింది.