Koo: ట్విట్ట‌ర్‌కు ప్రత్యామ్నాయంగా వ‌చ్చిన 'కూ' మూత‌!

Indian microblogging platform Koo is shutting down

  • ఆర్థిక ఇబ్బందుల‌తోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వ్యవస్థాపకుల ప్ర‌క‌ట‌న‌
  • డైలీహంట్ స‌హా వివిధ కంపెనీలతో విక్ర‌యానికి చ‌ర్చ‌లు జ‌రిపినా విఫలం
  • 2020లో 'కూ'ను ప్రారంభించిన‌ అప్రమేయ రాధాకృష్ణ, మ‌యాంక్ బిదావ‌త్కా 
  • 10కి పైగా భాష‌ల్లో అందుబాటులో ఉన్న ఫ‌స్ట్‌ ఇండియ‌న్ మైక్రోబ్లాగింగ్ సైట్‌గా గుర్తింపు
  • దాదాపు 60 మిలియ‌న్ డౌన్‌లోడ్‌లు జ‌రిగిన వైనం

'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)కు ప్రత్యామ్నాయంగా వ‌చ్చిన స్వ‌దేశీ మైక్రోబ్లాగింగ్ 'కూ' మూత‌ప‌డింది. ఆర్థిక ఇబ్బందుల‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, కోఫౌండ‌ర్ మ‌యాంక్ బిదావ‌త్కా లింక్డ్‌ఇన్‌లో ఒక‌ పోస్ట్ ద్వారా ప్రకటించారు. 

ఆన్‌లైన్ మీడియా సంస్థ డైలీహంట్ స‌హా వివిధ కంపెనీలతో విక్ర‌యానికి చ‌ర్చ‌లు జ‌రిపినా అవి విఫలం కావ‌డంతో తాజాగా త‌మ కార్యక‌లాపాల‌ను నిలిపి వేసింది. టైగర్ గ్లోబల్, యాక్సెల్, 3one4 క్యాపిటల్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ వంటి ప్రముఖ పెట్టుబడిదారుల నుండి $50 మిలియన్లకు పైగా సేకరించినప్పటికీ కూ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోలేక‌పోయింది. దీంతో గతేడాది ఆదాయాన్ని సంపాదించడానికి చాలా కష్టపడింది. 

ఇక 2020లో అప్రమేయ రాధాకృష్ణ, మ‌యాంక్ బిదావ‌త్కా దీన్ని స్థాపించ‌గా దాదాపు 60 మిలియ‌న్ డౌన్‌లోడ్‌లు జ‌రిగాయి. 10కి పైగా భాష‌ల్లో అందుబాటులో ఉన్న మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ మైక్రోబ్లాగింగ్ సైట్‌గా ఇది గుర్తింపు పొందింది. ఈ యాప్ లోగో కూడా దాదాపు ట్విట్ట‌ర్‌ను పోలి (ప‌క్షి) ఉంటుంది.    

కాగా, రైతు ఉద్య‌మ స‌మ‌యంలో అకౌంట్ల బ్లాకింగ్ విష‌యంలో ట్విట్ట‌ర్‌తో కేంద్రానికి ఘ‌ర్ష‌ణ నెల‌కొన్న‌ప్పుడు కూ బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కేంద్ర‌మంత్రులే స్వ‌యంగా దీన్ని ఆత్మ‌నిర్భ‌ర్ యాప్‌గా ప్ర‌మోట్ కూడా చేశారు. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే 'కూ'కు వినియోగ‌దారుల సంఖ్య భారీగా పెరిగింది. 

ఈ క్ర‌మంలో నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల‌కు కూడా త‌న కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించింది. కానీ, ఆ త‌ర్వాత ఆర్థిక క‌ష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. వాటి నుంచి బ‌య‌ట‌పడేందుకు వివిధ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌ర‌కు మూసివేత‌కు దారితీసింది.

  • Loading...

More Telugu News