CPI Narayana: అందుకే వైసీపీ ఓడిపోయింది: సీపీఐ నారాయ‌ణ

CPI Narayana Comments on YSRCP

  • రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమన్న నారాయ‌ణ‌
  • అది లేక‌పోవ‌డం వ‌ల్లే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయింద‌ని వ్యాఖ్య‌
  • జ‌గ‌న్‌ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వ‌ల్ల‌ తీవ్రంగా నష్టపోయార‌న్న సీపీఐ నేత‌
  • జ‌గ‌న్‌లానే కేసీఆర్, నవీన్ పట్నాయక్ కూడా నష్టపోయారని వెల్ల‌డి

రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని, అది లేక‌పోవ‌డం వ‌ల్లే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయింద‌ని సీపీఐ నారాయ‌ణ అన్నారు. బీజేపీతో ఉంటే ఉన్నామ‌ని, లేక‌పోతే లేమ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయారన్నారు. ఆయ‌న‌ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోయార‌ని పేర్కొన్నారు. 

అసెంబ్లీలో సీట్ల‌ సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందని, అంతే తప్ప ఓట్ల శాతం ఆధారంగా కాద‌ని తెలిపారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే వైసీపీ 11 స్థానాల‌కు పరిమిత‌మైంద‌ని నారాయణ వ్యాఖ్యానించారు. 

ఇక న్యూట్రల్ స్టాండ్ వల్ల జగన్ మాత్ర‌మే కాదని కేసీఆర్, నవీన్ పట్నాయక్ కూడా తీవ్రంగా నష్టపోయారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీతో కలిసి వెళ్లాలనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం వాళ్ల వరకూ కరెక్టేనని నారాయణ అన్నారు. కాగా, టీడీపీ కూటమిలో పవన్ డైనమిక్ పాత్ర పోషించారన్నారు. ఆయ‌న‌కు ఉన్న‌ సినిమా చ‌రిష్మా ఎన్నికల్లో ప్లస్ అయిందన్నారు. అందుకే పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన గెలిచిందని తెలిపారు. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించామని చెప్పిన ఆయ‌న‌.. జగన్ హయాంలో ప్రజాస్వామ్యం దెబ్బ‌తింద‌ని తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా దుమారం రేపుతున్న రుషికొండ భవనాల నిర్మాణంపై కూడా నారాయ‌ణ స్పందించారు. ఈ భ‌వ‌నాల‌ను నిర్మించేటప్పుడు ప్రతిపక్ష నేతలను వైసీపీ ప్ర‌భుత్వం అక్కడకు వెళ్లనీయలేదన్నారు. ఈ భవనాల్ని కూటమి ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాలని నారాయణ సూచించారు.

  • Loading...

More Telugu News