Monty Panesar: టీ20 ప్రపంచకప్ భారత్దే.. కోహ్లీ సెంచరీతో అదరగొడతాడు: మాంటీ పనేసర్
![Monty Panesar makes bold prediction about Virat Kohli ahead of T20 WC final](https://imgb.ap7am.com/thumbnail/cr-20240629tn667f9798b15d8.jpg)
- బార్బడోస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్
- ఈ ఫైనల్ మ్యాచ్పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ జోస్యం
- ఫామ్ కోల్పోయి టోర్నీలో తడబడుతున్న కోహ్లీపై విశ్వాసం వ్యక్తం చేసిన పనేసర్
మరికొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భారత్, దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన జోస్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోరులో కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని పనేసర్ అంచనా వేశాడు. అలాగే ఈ టోర్నీలో ఫామ్లో లేని విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోస్యం చెప్పాడు.
కాగా, ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో విరాట్ కోహ్లీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 61.75 సగటు, 154.69 స్ట్రైక్ రేట్తో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. కానీ, ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే జరిగిన టీ20 వరల్డ్కప్లో ఫామ్ కోల్పోవడం అభిమానులను కలవరపరుస్తోంది. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విరాట్ 7 మ్యాచ్ల్లో 10.71 సగటుతో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక పనేసర్తో పాటు రోహిత్ శర్మ కూడా ఫైనల్లో కోహ్లీ రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నాకౌట్ మ్యాచుల్లో కోహ్లీ ఎంతో సమర్థవంతమైన ఆటగాడని తెలిపాడు.
"అతను (కోహ్లీ) ఎంతో నాణ్యమైన ఆటగాడు. మాకు అతని క్లాస్ బ్యాటింగ్ గురించి బాగా తెలుసు. ఇలాంటి నాకౌట్ మ్యాచుల్లో ఇంతకుముందు ఎంతో సమర్థవంతంగా ఆడి జట్టుకు మరుపురాని విజయాలను అందించాడు. అతని ఫామ్ ఎప్పుడూ సమస్య కాదు. 15 ఏళ్ల పాటు క్రికెట్ ఆడినప్పుడు, ఫామ్ పెద్ద సమస్య కాదు. ఇలాంటి క్లాస్ ఆటగాడు ఎప్పుడైనా ఫామ్ అందుకోవచ్చు. అతను బహుశా ఫైనల్ కోసం పరుగులను ఆదా చేస్తున్నాడనుకుంటా. కచ్చితంగా ఫైనల్లో రాణిస్తాడు" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.