Dasoju Sravan: రేవంత్ రెడ్డి గారూ... కేసీఆర్‌కు అందుకు నోటీసులు ఇస్తారా?: దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

Dasoju Sravan open letter to CM Revanth Reddy

  • మిగులు విద్యుత్ అందించిన కేసీఆర్‌కు సంజాయిషీ నోటీసులు ఇస్తారా? అని ప్రశ్న
  • పగ, ప్రతీకార రాజకీయ కుయుక్తులకు మీ పాలన పరాకాష్ఠగా మారిందని విమర్శ
  • ప్రతీకార రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని సూచన

విద్యుత్ లోటుతో ఇబ్బందులుపడిన తెలంగాణకు... మిగులు విద్యుత్ అందించిన మాజీ సీఎం కేసీఆర్‌కు సంజాయిషీ నోటీసులు ఇస్తారా? అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ...' అంటూ లేఖ రాశారు. పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్ఠగా మీ పరిపాలన చాలా అధ్వానంగా మారిందని విమర్శించారు.

'విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ గారికి సంజాయిషీ నోటీసులా??
తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు కేసీఆర్ గారికి సంజాయిషీ నోటీసులా??
ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకు కేసీఆర్ గారికి సంజాయిషీ నోటీసులా??' అని ప్రశ్నించారు.
 
రేవంత్ రెడ్డి గారూ... మీ ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండని సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే మీ దుష్ప్రయత్నాలను విరమించుకోండని సూచించారు.

'కేసీఆర్ గారి నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని మీ ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదు. హామీల అమలు చేతకాని గుంపుమేస్త్రీగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు మీరు తెరలేపారు. రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు. 4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళకు రూ.2,500 లాంటి పథకాలు అమలు చెయ్యడం మీకు చేతకాక, కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో, రాజకీయ కుయుక్తులను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మీ ఆలోచనలు, కృషిని కేంద్రీకరించండని సూచించారు. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను, వారి అభివృద్ధిని అణగదొక్కే ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News