Prudhvi Raj: నా మీద ఏంటా వార్తలు...? ఎవరినీ వదలను!: నటుడు పృథ్వీరాజ్ ఫైర్

Actor Prudhviraj fires on media outlets

  • పృథ్వీరాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ అంటూ వార్తలు
  • భార్యకు భరణం చెల్లించడంలేదంటూ కథనాలు
  • వార్తలను తీవ్రంగా ఖండించిన పృథ్వీరాజ్
  • యూట్యూబ్ చానళ్లు, మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

మొదటి భార్యకు మనోవర్తి బకాయిలు చెల్లించకపోవడంతో టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ ఈ ఉదయం కథనాలు వచ్చాయి. దీనిపై పృథ్వీరాజ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ కథనాలు అవాస్తవం అని ఖండించారు. కనీసం తన వివరణ అడిగి ఉంటే వాస్తవాలు ఏంటో తాను చెప్పేవాడ్నని అన్నారు. తప్పుడు కథనాలు ఇచ్చే మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 

"ఈ ఉదయం నుంచి పృథ్వీరాజ్ అరెస్ట్, పృథ్వీరాజ్ ను కోర్టులో లొంగిపొమ్మన్నారు, పృథ్వీరాజ్ ను తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు, పృథ్వీరాజ్ అలాంటోడు, పృథ్వీరాజ్ ఇలాంటోడు అంటున్నారు. గత మూడేళ్లుగా మొదటి భార్యకు భరణం చెల్లించడంలేదు, ప్రతి నెల 10వ తేదీ లోపు చెల్లించాల్సిన భరణం ఇవ్వడంలేదు, బకాయిలు ఉన్నాయి... అందుకే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అని కథనాలు వచ్చాయి. 

అందరికీ ఓ విషయం చెప్పాలి. నా మొదటి భార్యకు ఎంత భరణం చెల్లించాలని కోర్టు చెప్పిందో, అంత మొత్తంలో భరణం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాను. ఈ రోజు వరకు కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాను. చిన్న చిన్న యూట్యూబ్ చానళ్లు కానీ, ఇతర మీడియా సంస్థలు కానీ నన్ను సంప్రదిస్తే బాగుండేది. 

ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టు పరిధిలో కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది. నిర్దేశించిన మేరకు నగదును ప్రతి నెలా నేను హైకోర్టు ఖాతాలో జమ చేస్తున్నాను. ప్రతి నెలా కడుతూనే ఉన్నాను కదా... కానీ ఇవాళ నా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాశారు. అంత అవమానకరంగా రాయాల్సిన అవసరం లేదు. దయచేసి ఏది పడితే అది రాయొద్దండీ! పాత్రికేయుల్లో నాకు చాలామంది మిత్రులున్నారు. ఏం జరిగింది అని నన్ను అడిగితే నేను వాస్తవాలు చెప్పేవాడ్ని.

నేను మా లాయర్లను కూడా కనుక్కున్నాను. ఈ కథనాలు చూసి వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటండీ... ఇలాంటి వార్తలు వస్తున్నాయి... వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా కథనాలు ప్రసారం చేస్తారు అని అన్నారు. 

నా గురించి ప్రస్తావించిన యూట్యూబ్ చానళ్లు, ఇతర మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోగలను. మా లాయర్లతో సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను కూడా. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. 

ఇది కుటుంబ వ్యవహారం... కోర్టులో ఉంది... వార్తలు వేసేటప్పుడు అడగండి... కుటుంబ వ్యవహారాన్ని కూడా బజారుకు ఈడ్చేస్తారా? మీరేమైనా కోర్టులా? ఒక వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు రాయకండి. క్యారెక్టర్ ను దిగజార్చే ప్రయత్నం చేయకండి. న్యాయబద్ధంగా కోర్టు ఏదైతే చెప్పిందో, అంత మేర భరణం ఈ జూన్ వరకు ప్రతి నెలా కడుతూ వస్తున్నాను. దీనిపై నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడను. మా లాయర్లతో మాట్లాడి ఎవరిపై చర్యలు తీసుకోవాలో త్వరలోనే వారి పేర్లు వెల్లడిస్తాను" అంటూ పృథ్వీరాజ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News