India vs USA: అమెరికాపై భారత్ విక్టరీ.. సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియా

India seven wicket win over the United States of America secured the Super 8 qualification

  • 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
  • 111 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించిన భారత్
  • రాణించిన అర్షదీప్ సింగ్, సూర్య కుమార్ యాదవ్

టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా వరుసగా మూడవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టార్గెట్ ఛేజింగ్‌లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 49 బంతుల్లో 50 పరుగులు చేసి, భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. శివమ్ దూబేతో జతకట్టి చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. బౌలింగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు.

పవర్‌ప్లే ప్రారంభంలోనే ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ ఔట్ అయ్యారు. ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ కూడా జట్టు స్కోరు 39 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో జట్టు ఇబ్బందుల్లో పడినట్టు అనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే నాలుగవ వికెట్‌కు ఏకంగా 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ 49 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక దూబే 31 పరుగులతో నాటౌట్‌గా చివరి వరకు క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ 3, విరాట్ కోహ్లీ 0, రిషబ్ పంత్ 18 చొప్పున పరుగులు చేశారు. ఇక అమెరికా బౌలర్లలో సౌరబ్ నేత్రవాల్కర్ 2, అలీ ఖాన్ 1 వికెట్ తీశారు.

అదరగొట్టిన బౌలర్లు
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేసింది. అమెరికా బ్యాటర్లలో 27 పరుగులు చేసిన నితీశ్ కుమార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో స్టీవెన్ టైలర్ 24, ఆడ్రీస్ గౌస్ 2, ఆరోన్ జోన్స్ 11, కోరీ అండర్సన్ 14, హర్మీత్ సింగ్ 10, వాన్ 11 (నాటౌట్), జస్దీప్ సింగ్ 2 చొప్పున పరుగులు చేశారు. కాగా భారత బౌలర్లు ఆరంభంలోనే కీలకమైన వికెట్లు పడగొట్టడం ద్వారా అమెరికా భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. ముఖ్యంగా పేసర్ అర్షదీప్ సింగ్ మరోసారి అదరగొట్టాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన అర్షదీప్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు.

అమెరికా ఇన్నింగ్స్ ఆరంభం బంతికే తొలి వికెట్ తీసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అదే ఓవర్‌లో మరో వికెట్ తీశాడు. దీంతో అతిథ్య జట్టు అమెరికా మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. మిగతా భారత బౌలర్లలో వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 చొప్పున వికెట్లు తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది. కాగా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన అర్షదీప్ సింగ్‌కి ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా 6 పాయింట్లతో టీమిండియా సూపర్-8 దశకు అర్హత సాధించింది. మరో మ్యాచ్ ఉండగానే తదుపరి రౌండ్‌లో అడుగుపెట్టింది.

  • Loading...

More Telugu News