Andhra Pradesh: ఎన్నికల సమయంలో హింస, దాడులపై సిట్ తుది నివేదిక అందజేత

SIT Investigation On Violation of YCP Activists in AP Elections

  • ఈసీ ఆదేశాలతో ఐజీ వినీత్‌ బ్రిజిలాల్‌ నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్‌
  • అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై సిట్‌ బృందాల దర్యాప్తు
  • 157 పేజీల నివేదికను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు సమర్పించిన సిట్ 

అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఐజీ వినీత్‌ బ్రిజిలాల్‌ నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్‌ బృందాలు దర్యాప్తు నిర్వహించి 157 పేజీల నివేదికను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు సమర్పించాయి. దీనిలో భాగంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల రోజు మే 13న, ఆ తర్వాత అల్లరి మూకలు మారణాయుధాలతో విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ధ్రువీకరించింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్‌ బూత్‌లోకి దూసుకొచ్చి ఈవీఎం విధ్వంసం చేసిన తీరు నుంచి పోలీసు స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన వైనాన్ని ఆ నివేదికలో వివరించడం జరింగింది.

3 జిల్లాల పరిధిలో నమోదైన 37 కేసుల గురించి ప్రతి అంశాన్ని అందులో పొందుపరిచింది. వీటిలో ఈవీఎంల విధ్వంస  ఘటనలకు సంబంధించి 7, ఇతర హింసాత్మక ఘటనలకు సంబంధించి 30 కేసులు ఉన్నాయి. ఇక మొత్తం 37 కేసులకు గాను ఏకంగా 32 కేసుల్లో ఆ నేరానికి తగిన సెక్షన్లు వర్తింపజేయలేదని సిట్‌ గుర్తించింది. అలాగే 11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్ (ఐపీసీ 307) పెట్టాల్సి ఉండగా దాన్ని వర్తింపజేయలేదని సిట్‌ నిర్ధారించింది. అందులో 7 కేసులు పల్నాడు జిల్లా పరిధిలో, 4 కేసులు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. 

అలాగే పలు కేసుల్లో ఐపీసీ 143, 144, 145, 147, 148, 188, 448, 427, 506, 394 (బీ), 352, 436, 452 రెడ్ విత్ 149 వంటి సెక్షన్లను వర్తింపజేయాల్సి  ఉన్నా పట్టించుకోలేదని, ఈ లోపాలను గుర్తించి సిట్‌ వాటిని సరిదిద్దింది. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ 143, 147, 353, 452 రెడ్ విత్ 149, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 131, 135 సెక్షన్లను సిట్‌ సూచనతో పోలీసులు జత చేశారు. 

సత్తెనపల్లి నియోజకవర్గం గుండ్లపల్లె గ్రామంలో 170వ  పోలింగ్ స్టేషన్ లో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ 120బీ, 188, 352, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125, 128, 132, 134 (ఏ, బీ) సెక్షన్లను వర్తింపజేయాలని సిట్‌ తేల్చడంతో దర్యాప్తు అధికారులు వాటిని జత చేశారు.

హింసాత్మక ఘటనల్లో అత్యధిక శాతం పట్టపగలు నివాసిత ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నా దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించలేదని సిట్‌ తేల్చింది. వెబ్‌కాస్టింగ్‌ ఫీడ్‌ నుంచి ఈవీఎంల విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయకుండానే గుర్తుతెలియని వ్యక్తులంటూ ఫిర్యాదులిచ్చారు. అది కూడా ఘటన జరిగిన వెంటనే కాకుండా కొంత జాప్యం చేసినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఆయా ఘటనల్లో పోలింగ్‌ బూత్ లోని సిబ్బందిని తప్పనిసరిగా ప్రశ్నించాలని సిట్‌ స్పష్టం చేసింది. అలాగే గతంలో భయం వల్ల వాంగ్మూలం ఇవ్వటానికి ముందుకు రాని సాక్షుల్ని గుర్తించి వారితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు నమోదు చేయించాలని సిట్‌ సిఫార్సు చేయడం జరిగింది.

  • Loading...

More Telugu News