Srinivasananda Saraswati: విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందపై నిప్పులు చెరిగిన శ్రీనివాసానంద సరస్వతి

Srinivasananda Saraswati fires on Swami Swaroopananda

  • ఇవాళ మీడియా ముందుకు వచ్చిన స్వామి స్వరూపానంద
  • తాము ఏ ప్రభుత్వంలోనూ తలదూర్చలేదని వెల్లడి
  • రాజకీయాలకు దూరమని వ్యాఖ్యలు
  • నువ్వొక పీఠాధిపతివా అంటూ స్వరూపానందపై శ్రీనివాసానంద ఫైర్
  • జగన్ ను ఒక్కసారైనా హెచ్చరించావా? అంటూ ఆగ్రహం

విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఇవాళ మీడియా ముందుకు వచ్చి... తాము రాజకీయాలకు దూరం అని, తాము ఏ ప్రభుత్వంలోనూ తలదూర్చబోమని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ఇవాళే మీడియా ముందుకు వచ్చానని వెల్లడించారు. అయితే, స్వరూపానంద వ్యాఖ్యలపై ఏపీ సాధు పరిషత్ నేత శ్రీనివాసానంద సరస్వతి నిప్పులు చెరిగేలా స్పందించారు. 

"నాడు ఆలయాల మీద, దేవతా విగ్రహాల మీద, అర్చకుల మీద, బ్రాహ్మణుల మీద, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. చిత్తూరులో వైసీపీ నేతలు భూ దందాలు చేసి రాత్రికి రాత్రి అచ్యుతానందస్వామిని చంపేశారు. ఏం స్వరూపానంద... ఇలాంటి స్వామీజీలపై హత్యాకాండలు జరుపుతుంటే ఎక్కడికి వెళ్లావ్ నువ్వు? ఆ రోజు మీ నోరు ఏమైంది? ఆ రోజు నీ పీఠం ఏమైంది? ఆ రోజు నువ్వు ఏమైపోయావ్? వైసీపీ పాలనలో స్వామిజీని అత్యంత దారుణంగా చంపేస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా నువ్వు? సిగ్గులేకుండా కాషాయ ముసుగు వేసుకుని ఇంకా నాటకాలు ఆడుతున్నావా?

రామతీర్థం... మీ విశాఖ శారదాపీఠానికి ఎంత దూరంలో ఉంది? రామతీర్థం ఆలయంలో రాముడి శిరస్సు ఖండిస్తే... దేశవిదేశాల్లో రామభక్తులు కన్నీరు పెట్టుకున్నారు. కానీ నువ్వు ఏమాత్రమైనా కరిగావా? నీదొక పీఠం... నువ్వొక స్వామివి! మళ్లీ నీకు కాషాయ దుస్తులు, చేతిలో దండం! సిగ్గులేదయ్యా నీకు... ఇప్పుడొచ్చి శ్రీరంగనీతులు చెబుతావా? ఇప్పుడు నీకు భయం కలుగుతోంది. అందుకే హడావిడిగా మీడియా ముందుకు వచ్చావు. 

ఇప్పటికే హిందువులందరూ నిన్ను చీదరించుకుని, ఈయన హిందూ ధర్మానికి ద్రోహి అంటున్నారు. ఈయన ఒక స్వామి కాదు... ఒక వ్యాపారస్తుడిగా, ఒక భూకబ్జాదారుడిగా, సెటిల్మెంట్లు చేసుకునే వ్యక్తిగా దీనాతిదీనమైన స్థితిలో ఉన్నాడని హిందూ సమాజం ఈయనను అసహ్యించుకుని ఏ కార్యక్రమాలకు పిలవడం మానేసింది. నువ్వు చేస్తున్న దురాగతాలతో ఆ పీఠాన్ని చూసి అందరూ ఉమ్మివేస్తున్నారు. 

రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండిస్తే కనీసం చూడ్డానికైనా వచ్చావా నువ్వు? మీ పీఠం తరఫున కనీసం ఒక్కరినైనా పంపించావా? మీ పీఠం హిందూత్వం కోసం ఉన్నదా? సిగ్గులేదటయ్యా అలాంటి మాటలు మాట్లాడడానికి! వైసీపీ పాలనలో విశాఖలో సెటిల్మెంట్ చేసుకుని, పీఠాన్ని ఒక రాజకీయ పీఠంగా, వైసీపీ పీఠంగా మార్చేశావు. అనేక రకాల మధ్యవర్తిత్వాలు, అనేక లావాదేవీలు చేసుకుంటున్న నువ్వు... రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కించపరుస్తుంటే ఏ రోజైనా ఒక్కరినైనా హెచ్చరించావా నువ్వు? 

తిరుమల పవిత్రత నాశనమైపోతే నీకు కనిపించలేదా? తిరుమలలో చంటిబిడ్డలకు పాలు అందించలేకపోయారు... జగన్ తన భార్య లేకుండానే తిరుమల వెళ్లి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం శాస్త్రవిరుద్ధం కాదా? అది ఆచారాలను మంటగలపడం కాదా? ఏమయ్యా జగన్... తిరుమల ఆలయంలోకి భార్యతో వెళ్లాలయ్యా అని ఏనాడైనా సూచించారా? అప్పుడు నోరు లేదా మీకు? అది తప్పు అని తెలియదా మీకు? 

హిందువులు ఇంట్లో కనీసం సత్యనారాయణవ్రతం చేసుకున్నా పక్కన భార్య ఉండాలి. తిరుమల బ్రహ్మోత్సవాలు, విజయవాడ నవరాత్రి మహోత్సవాల్లో అపచారాలకు పాల్పడతారా?ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, పాలకులు భార్యలతో కలిసి ఆలయాల్లోకి వెళ్లలేదా? ఈ విషయం మీకు తెలియదా? ఆ రోజు మీ నోరు పడిపోయిందా? మీకు ఇంగితజ్ఞానం లేదా? 

నాడు భారతంలో ద్రౌపదికి దుష్ట చతుష్టయం వస్త్రాపహరణం చేస్తుంటే కురుపెద్దలు చూస్తూ ఉన్నట్టు... రాష్ట్రంలో జగన్ హిందూ ధర్మాన్ని వివస్త్రను చేసి, హిందూ  ధర్మాని వెక్కిరించి, హిందూ దేవాలయాల డబ్బు పట్టుకెళ్లి జిల్లా ఆఫీసుల ఫర్నిచర్ కు, అమ్మఒడి, ఆ ఒడి, ఈ ఒడి అంటూ తన సొంత కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటే నిలదీయలేకపోయావు... ఆ రోజున నీ హిందూ ధర్మం ఏమైంది? ఎందుకు మాట్లాడలేదు? 

జగన్ మోహన్ రెడ్డికి అమ్ముడుపోయిన మీరు.... ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీ ఆటలు సాగవని, మీ మధ్యవర్తిత్వాలు ఇక జరగవని, మీ లాభార్జనకు ఉపయోగపడే సెటిల్మెంట్లు ఇక ఉండవని... ఇప్పుడు మీడియా ముందుకొచ్చి కొత్తగా కూనిరాగాలు తీస్తున్నారు... ఎవరికి తెలియదు మీ నిజస్వరూపం? జగన్ మోహన్ రెడ్డి హిందూ కార్యక్రమాలకు అడ్డుతగులుతుంటే ఎప్పుడైనా హెచ్చరించావా... నీ నోటికి పక్షవాతం వచ్చిందా? ఇప్పుడొచ్చి సిగ్గులేని మాటలు మాట్లాడతావా? 

ఇక నీ పని అయిపోయింది. ఇవాళొచ్చి కొత్త కొత్త మాటలు మాట్లాడి సానుభూతి పొందాలని చూస్తే ఎవరు నమ్ముతారండీ! రాష్ట్రంలో మీరు క్రైస్తవులు, మహమ్మదీయులకు మాత్రమే ముఖ్యమంత్రి కాదండీ.. హిందువులకు కూడా మీరు ముఖ్యమంత్రి అని జగన్ కు ఎన్నోసార్లు చెప్పి చూశాం. ఆయన పట్టించుకోలేదు. ఆయన భార్య వైఎస్ భారతి వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పడేయడం అందరూ చూశారు. ఏమయ్యా స్వరూపానంద... వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని చెత్తబుట్టలో పడేస్తే, ఇది తప్పు అని చెప్పగలిగావా? 

ఓ ప్రభుత్వాన్ని తిడతావు, ఓ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేస్తావు, మంత్రులను రప్పించుకుంటావు... బ్లాక్ మెయిలింగ్ చేస్తావు, రకరకాల కుయుక్తులకు పాల్పడతావు... ఆ అవినీతి సొమ్ముతో ఉపన్యాసాలు చెబుతుంటావు. ఈ శరీరం అశాశ్వతం అంటూ అందరికీ హితబోధ చేస్తుంటావు... మరి నువ్వేమైనా ఈ వందల కోట్లు  మోసుకుని వెళతావా? 

ఓసారి ఆత్మ పరిశీలన చేసుకో స్వరూపానందా! ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో... తప్పులు సరిదిద్దుకుని సక్రమ మార్గంలో నడిస్తే హిందూ సమాజం నిన్ను క్షమిస్తుంది. కానీ, నువ్వు పశ్చాత్తాపం లేకుండా, తప్పు మీద తప్పు చేస్తూ, వాటిని కప్పిపుచ్చుకుంటూ... ఇవాళేదో చంద్రబాబునాయుడి గారి మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 

నీకు నిజంగా చంద్రబాబుపై ప్రేమే ఉంటే... రామతీర్థం ఘటన జరిగినప్పుడు చంద్రబాబు కొండపైకి వస్తే ఆయనకు కనీసం అభినందనలు తెలియజేశావా నువ్వు? మా హిందూ ధర్మం కోసం చంద్రబాబు నాలుగు అడుగులు వేశారని చంద్రబాబును ప్రశంసించావా నువ్వు? నీకు చంద్రబాబుపై అభిమానం ఉందని నమ్మమంటావా? ఎందుకయ్యా మొసలి కన్నీరు కార్చుతావు? 

30 సంవత్సరాల నుంచి పీఠాధిపతిగా ఉన్నానని చెబుతున్నావు... ఏం చేశావు ఈ 30 ఏళ్లు? ఎక్కడైనా సరే హిందూ సమాజంలో చర్చకు వస్తారా... మేం సిద్ధం. ఎవరు ధర్మం కోసం ఉన్నారో, ఎవరు ధర్మాన్ని అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారో హిందూ సమాజం చెబుతుంది. మీ శారదా పీఠం ధర్మం కోసం పనిచేస్తోందా, ధనం కోసం పనిచేస్తోందా? రండి సమాజంలోకి... తేల్చుకుందాం! కాషాయం ముసుగులో హిందుత్వానికి కళంకం తెచ్చిపెట్టిన పీఠంగా మీ శారదా పీఠం చరిత్రలో నిలిచిపోతుంది" అంటూ శ్రీనివాసానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News