KTR: 'నీట్' అవకతవకలపై విచారణ జరిపించాలని ఎన్డీయే ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

KTR demands for enquiry in NEET exams

  • లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ అంశంపై స్పందించాలని సూచన
  • నీట్ ఎగ్జామ్ వ్యవహారాలు చూస్తుంటే అవకతవకలు జరిగినట్లుగా అర్థమవుతోందన్న కేటీఆర్
  • 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్న
  • చాలామంది విద్యార్థులకు 718, 719 మార్కులు ఎలా వచ్చాయో చెప్పాలన్న కేటీఆర్

కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీయే ఎదుట ఎన్నో సవాళ్ళున్నాయని... కానీ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన 'నీట్' అంశంపై వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్‌కు సంబంధించి కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనికి తోడు ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారని తెలిపారు. నీట్‌లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుందని... ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యమయ్యే పని కాదన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని చెబుతున్నారని... కొంతమంది విద్యార్థులకు 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంబించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. నీట్ ఫలితాలను ప్రీపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే నీట్ ఎగ్జామ్ విషయంలో బీఆర్ఎస్ తర‌పున పలు పశ్నలతో పాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు ఉంచుతున్నట్లు తెలిపారు.

కొన్ని ప్రశ్నలు/డిమాండ్లు:

1) గత ఐదేళ్లలో తెలంగాణా నుండి ఏ విద్యార్థి కూడా మొదటిసారిగా టాప్ 5లో లేరు. దీనికి కారణం వివిధ అక్రమాలు అని భావిస్తున్నాము.
2) గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన ప్రక్రియను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 1,500 మంది విద్యార్థులతో కూడిన ఎంపిక చేసిన సమూహానికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే ప్రామాణిక పద్ధతి ఉండాలి.
3) మేము న్యాయం కోరుతున్నాం... విద్యార్థులందరికీ... వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా... క్షుణ్ణంగా దర్యాప్తు చేయడానికి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News