Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్
![Neerabh Kumar Prasad Appointed To New CS in Andhra Pradesh](https://img.ap7am.com/thumbnail/cr-20240607tn66628b1d341e0.jpg)
- ఏపీ కేడర్కు చెందిన నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
- ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు
- ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ కేడర్కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరభ్ కుమార్ ప్రసాద్ను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక నీరభ్ కుమార్ బుధవారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. నీరభ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
మరోవైపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుండడంతో సీఎంఓ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది.
ఇదిలాఉంటే.. జవహర్ రెడ్డిపై వైసీపీకి అనుకూలంగా పని చేశారనే అనేక ఆరోపణలు ఉన్నాయి. జవహర్ రెడ్డి రాజధాని పేరుతో విశాఖపట్నం, భోగాపురం సమీపంలోని రైతుల భూములను అక్రమంగా వైసీపీ నేతలకు కట్టబెట్టారని జనసేన నేత పీతల మూర్తి ఆరోపించారు. రైతులను బెదిరించి, వారి భూములను రాయించుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ తెచ్చుకునట్టు పేర్కొన్నారు.