Botsa Satyanarayana: ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: బొత్స సత్యనారాయణ

Former Minister Botsa Satyanarayana Press Meet

  • ప్రజాసేవకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటామని హామీ
  • పేదలకు మేలు జరిగేలా ప్రభుత్వం పాలించాలని ఆకాంక్ష
  • మాకంటే మెరుగైన పాలన ప్రజలు కోరుకోవడం వల్లే ఓడిపోయామన్న వైసీపీ నేత
  • గురువారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాజీ మంత్రి

ఐదేళ్ల పాలనలో నిరంతరం ప్రజాసేవ చేశామని, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇకముందు కూడా ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. తమ హయాంలో పేద ప్రజలకు మెరుగైన పాలన అందించామని, రాష్ట్ర అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేశామని వివరించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. అయినా ప్రజలు తమను ఓడించడానికి కారణం మాకన్నా మెరుగైన పాలన అందిస్తారని ఆశపడి ఉండొచ్చని బొత్స తెలిపారు. మెరుగైన జీవనం, పాలన ఆశించడం ప్రజల తప్పుకాదని చెప్పారు. అల్టిమేట్ గా ప్రజలకు.. ముఖ్యంగా పేద ప్రజలకు మేలు జరగడమే తమకు కావాలని వివరించారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటూ కొత్త ప్రభుత్వానికి బొత్స విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వంలో ఎవరు ఉన్నా సరే ప్రజలకు ఎలా మేలు చేయాలనే ఆలోచించాలని బొత్స చెప్పారు. వైసీపీ కన్నా మెరుగైన పాలన, సంక్షేమాన్ని ప్రజలు కోరుకున్నారని వివరించారు. ప్రజల ఆకాంక్షలను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని, వాటిని అందుకునేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం మారితే తమ జీవన విధానం మరింత మెరుగుపడుతుందేమోనని ప్రజలు భావించి ఉండొచ్చని, అదే తమ ఓటమికి కారణమని అనుకుంటున్నట్లు వివరించారు. అది నిజం కావాలని, కొత్త ప్రభుత్వానికి ఆ శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐదేళ్ల పాలనలో తాము చేశామంటున్న తప్పులను కొత్త ప్రభుత్వం సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా విజయనగరం జిల్లా ప్రజలకు, ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

మెగా డీఎస్సీ ప్రకటనకు సంబంధించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాటలను ప్రస్తావిస్తూ.. ఆ స్థాయిలో ఖాళీలు లేక మెగా డీఎస్సీ ప్రకటించలేకపోయామని బొత్స వివరించారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ప్రకటిస్తే తాము కూడా సంతోషిస్తామని చెప్పారు. అల్టిమేట్ గా ప్రజలకు, నిరుద్యోగులకు, పేదలకు మేలు కలగడమే తమకు కావాలని చెప్పారు. చివరగా.. అధికార బాధ్యతల వల్ల మీడియా మిత్రులను అరుదుగా కలిశామని, ఇకపై అప్పుడప్పుడూ కలుసుకుందామంటూ బొత్స సత్యనారాయణ చెప్పారు.

Botsa Satyanarayana
YSRCP
YCP Defeat
Thaks Giving Speech
AP Assembly Results

More Telugu News