Etela Rajender: చంద్రబాబు, నితీశ్‌లను కలుస్తామని రేవంత్ రెడ్డి అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు: ఈటల రాజేందర్

Etala Rajendar fires at Revanth Reddy

  • ఇండియా కూటమి అధికారం చేపడుతుందని వెకిలిమాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • కేంద్రంలో ఐదేళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా
  • మోదీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారన్న ఈటల రాజేందర్
  • సొంత సీటు మల్కాజ్‌గిరి, సొంత నియోజకవర్గం పాలమూరులో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య

చంద్రబాబు, నితీశ్‌ను కలుస్తామని... ఇండియా కూటమి అధికారం చేపడుతుందని రేవంత్ రెడ్డి అర్థంలేని వెకిలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, నితీశ్‌లు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు వారిని కలుస్తామని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో ఐదేళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ... తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని ఓటర్లు తీర్పు చెప్పారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ మోదీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి ఓటు వేశారన్నారు. బీజేపీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించారన్నారు. అసెంబ్లీ కంటే... లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందన్నారు.

మల్కాజ్‌గిరి తన సీటు... మహబూబ్ నగర్ తన సొంత నియోజకవర్గమని విర్రవీగిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ రెండు  నియోజకవర్గాల ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ప్రజలతో సీఎం ఛీకొట్టించుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే వెంటపడి పని చేయిస్తామన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతోంది మోదీ మాత్రమే అన్నారు.

  • Loading...

More Telugu News