Sensex: ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో భారీ లాభాలతో తెరుచుకున్న స్టాక్ మార్కెట్

Sensex up 2500 points after exit polls prediction

  • కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందన్న అంచనాలపై మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ సెంటిమెంట్
  • సెన్సెక్స్ 2,500 పాయింట్లు, నిఫ్టీ 1,000 పాయింట్ల లాభం
  • అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్ సహా మరికొన్ని కంపెనీల షేర్లకు రెక్కలు

కేంద్రంలో మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పరుగులు తీసింది. శుక్రవారంతో ముగిసిన వారాంతానికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్... సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది.

సెన్సెక్స్ దాదాపు 4 శాతం లాభపడి 2,778 పాయింట్లకు టచ్ అయింది. తద్వారా 76,738.89 ఆల్ టైం హై (జీవితకాల గరిష్టానికి)కి చేరుకుంది. అలాగే నిఫ్టీ సైతం దాదాపు 4 శాతం లాభపడి 808 పాయింట్లు సాధించింది. 23,338.70 తాజా రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ జాబితాలోని మొత్తం 30 కంపెనీలు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ లోని మొత్తం లిస్టెడ్ కంపెనీల సంపద విలువ ఏకంగా రూ. 11.1 లక్షల కోట్లు పెరిగి రూ. 423.21 లక్షల కోట్లకు చేరుకుంది.

అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, శ్రీరాం ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. మార్కెట్ ర్యాలీని ముందుండి నడిపించాయి.  ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023–24 వార్షిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 8.2 శాతానికి చేరుకున్నట్లు తాజా జీడీపీ గణాంకాలు వెల్లడించడం కూడా మార్కెట్లు పెరిగేందుకు కారణమయ్యాయి.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని.. 350కిపైగా సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ స్వాగతించగా విపక్ష ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని తోసిపుచ్చింది. తమకే అనుకూల ఫలితాలు రాబోతున్నాయని తెలిపింది.

  • Loading...

More Telugu News