RBI: యూకే నుంచి 100 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చిన ఆర్బీఐ.. అసలు ఏం జరుగుతుంది?

RBI has moved 100 metric tonnes of its gold stored in the UK to domestic vaults in FY24

  • దేశీయంగా బంగారం ధరల నియంత్రణకు ఉపయోగపడనున్న దేశీయ నిల్వలు
  • బులియన్ మార్కెట్ పటిష్ఠతకు వాడుకునే అవకాశం
  • ఆర్బీఐ వద్ద 22.10 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు
  • సగానికి పైగా విదేశాల్లో నిల్వ ఉంచిన కేంద్ర బ్యాంక్

దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠత కోసం ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టే 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక చర్యకు ఉపక్రమించింది. యూకేలో నిల్వ చేసిన 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్థిక సంవత్సరం 2024లో దేశీయ మార్కెట్‌లోకి ఆర్బీఐ తరలించింది. 1991లో ‘విదేశీ మారక ద్రవ్య సంక్షోభం’ నివారణకు పెద్ద మొత్తంలో బంగారాన్ని ఉపయోగించగా.. తిరిగి మళ్లీ ఇప్పుడే భారీ స్థాయిలో పసిడిని కేంద్ర బ్యాంక్ కదిలించింది. అయితే ఇంత బంగారాన్ని ఆర్బీఐ ఏం చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అందుబాటులో ఉన్న నిల్వలను దేశీయంగా బంగారం ధరలను నియంత్రించేందుకు ఆర్బీఐ ఉపయోగించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (జీఈటీఎఫ్) వంటి పెట్టుబడి సాధనాలకు అధిక డిమాండ్ ఏర్పడేలా చేయవచ్చునని పేర్కొంటున్నారు. అంతేకాదు.. దేశీయంగా పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు అందుబాటులో ఉంటే స్థానిక బులియన్ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు సాయపడుతుందని అంటున్నారు.

ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉంది?
మార్చి 2024 నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 822.10 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌’ వంటి ఇతర దేశాల బ్యాంకుల్లో పసిడిని భద్రపరిచింది. తాజాగా ఇంగ్లండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత మార్కెట్‌లోకి తరలించడంతో దేశీయ నిల్వ చేసిన బంగారం మొత్తం పరిమాణం 408 మెట్రిక్ టన్నులకు చేరింది. దీంతో దేశీయంగా, విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలు దాదాపు సమానం అయ్యాయి. భారత్‌లో నిల్వ ఉంచిన బంగారంలో 308 మెట్రిక్ టన్నులను నోట్ల జారీ కోసం, మరో 100.28 టన్నుల పసిడి దేశీయ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ ఆస్తిగా ఉన్నాయని గురువారం ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక పేర్కొంది. ఇక విదేశాల్లో మొత్తం 413.79 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.

ఆర్బీఐ బంగారాన్ని విదేశాల్లో ఎందుకు నిల్వ చేస్తుంది?
కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ విదేశాల్లో బంగారాన్ని నిల్వచేయడానికి పలు కారణాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా చూసుకుంటే.. 1990-91లో విదేశీ మారకద్రవ్య సంక్షోభం నివారణకు భారత్ తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌’కు తాకట్టు పెట్టి 405 మిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది. అయితే ఈ రుణాన్ని నవంబర్ 1991 నాటికి తిరిగి చెల్లించింది. అయితే అప్పటి రవాణా కారణాల రీత్యా బంగారాన్ని భారత్‌కు తరలించేందుకు ఆర్బీఐ వెనుకడుగు వేసింది. దీంతో యూకేలోనే ఉంచాలని నిర్ణయించింది. మరోవైపు విదేశాలలో నిల్వ చేసిన బంగారాన్ని సులభంగా ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉండడం, ఎక్స్ఛేంజ్‌లు, లాభాల స్వీకరణ కూడా సులభంగా ఉండడంతో అప్పట్లో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో అప్పటినుంచి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి విదేశాలలోనే నిల్వ చేయడం మొదలుపెట్టింది.

అయితే విదేశాలలో బంగారాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమనే విషయాన్ని ఆర్బీఐ ఇటీవలే గుర్తించింది. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో విదేశాల్లో బంగారం నిల్వలు అంత క్షేమం కాదని భావించింది. ఇటీవల ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ బ్యాంకుల్లో నిల్వ ఉన్న రష్యన్ ఆస్తులను స్తంభింపజేయడాన్ని ఆర్బీఐ క్షుణ్ణంగా గమనించింది. విదేశాలలో నిల్వ ఉన్న ఆస్తుల భద్రతపై ఆందోళన చెందిన ఆర్బీఐ.. యూకే నుంచి బంగారాన్ని స్వదేశానికి తరలించేందుకు నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News