Congress: 'తెలంగాణ' వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నాం: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud says will invite kcr to dashabdi fest

  • తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటోందని వ్యాఖ్య
  • కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్‌కు ఇబ్బందేమిటని ప్రశ్న
  • అందరితో చర్చించాకే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న కాంగ్రెస్ నేత

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తమ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటోందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మన రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్‌కు ఇబ్బందేమిటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కానీ బీఆర్ఎస్ హయాంలో అఖిలపక్షం నిర్వహించారా? అని ప్రశ్నించారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లోటుపాట్లు, అభ్యంతరాలు లేకుండా చిహ్నం రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

దశాబ్ది వేడుకలకు అమరవీరుల కుటుంబాలను పిలిచి సముచితస్థానంలో సత్కరిస్తామన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారందరికీ గౌరవం దక్కాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేశారు. అన్నీ తానే అన్నట్లు కేసీఆర్ ప్రజల్లో భ్రమలు కల్పించారని విమర్శించారు.

Congress
Mahesh Kumar Goud
  • Loading...

More Telugu News