Prashant Kishor: నా అంచనాలతో అట్టుడికిపోతున్న వారికి ఇదే నా సలహా: ప్రశాంత్ కిశోర్

Prashant Kishor tweets about drinking water

  • నీరు తాగడం శరీరానికి, మెదడుకు మంచిదన్న ప్రశాంత్ కిశోర్
  • తన అంచనాలతో గింజుకుంటున్న వారు జూన్ 4న బాగా నీళ్లు తాగాలని వ్యంగ్యం
  • కరణ్ థాపర్ తో ఇంటర్వ్యూ నేపథ్యంలో ఓ నెటిజన్ పోస్టుకు పీకే స్పందన

మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నీరు తాగడం మంచిదని, అది శరీరానికి, మెదడుకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. 

నా ఎన్నికల అంచనాల నేపథ్యంలో, ఫలితాలు ఎలా వస్తాయోనని గిజగిజలాడుతున్న వారు జూన్ 4న తాగేందుకు సమృద్ధిగా నీటిని అందుబాటులో ఉంచుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. 2021 మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. 

ప్రశాంత్ కిశోర్ ఈ ట్వీట్ చేయడానికి కారణం ఉంది. తాజాగా ఆయన ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వాడీవేడిగా సాగింది. మీరు హిమాచల్ ప్రదేశ్ విషయంలో వెలువరించిన అంచనాలు దారుణంగా తప్పాయి కదా అని కరణ్ థాపర్ ప్రశ్నించగా... నేను హిమాచల్ ప్రదేశ్ విషయంలో అంచనాలు వెలువరించినట్టు వీడియో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని పీకే ప్రశ్నించారు. 

ఈ క్రమంలో, ప్రశాంత్ కిశోర్ గ్లాసు నీళ్లను గడగడా తాగేసినట్టు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఫొటోతో సహా ప్రస్తావించాడు. ప్రశాంత్ కిశోర్ నీరుగారిపోయాడు అనే అర్థం వచ్చేలా ఆ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనిపైనే ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించి తాజా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.

Prashant Kishor
Election Results
Karan Thapar
India

More Telugu News