Devineni Uma: మాచర్ల బయల్దేరిన టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు: దేవినేని ఉమా

Devineni Uma said police house arrested TDP leaders

  • మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి
  • ఛలో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలు
  • తనను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారన్న దేవినేని ఉమా 

మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన నేపథ్యంలో, టీడీపీ నేతలు ఛలో మాచర్లకు పిలుపునిచ్చారు. అయితే తమను అడ్డుకున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా వెల్లడించారు. 

ఛలో మాచర్లకు టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు మాచర్ల బయల్దేరిన టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన నేతలను అడ్డుకున్నారని వివరించారు. విజయవాడలోని గొల్లపూడిలో తన ఇంటిని కూడా పోలీసులు చుట్టుముట్టారని, తనను హౌస్ అరెస్ట్ చేశారు అని ఉమా వెల్లడించారు. 

"ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం స్వయంగా పిన్నెల్లి ఈవీఎంలు పగులగొట్టాడు. ఈ నెల 15న వీఆర్వో పెట్టిన కేసులో పిన్నెల్లి పేరు లేదు. సీఎస్ జహవర్ రెడ్డి నాయకత్వంలోనే పోలింగ్ అధికారులను నియమించారు. ఈ నెల 20న సిట్ పర్యవేక్షణలో జరిగిన విచారణ సందర్భంగా కోర్టులో  వేసిన మెమోలో ఈ వాస్తవాలన్నీ బయటికొచ్చాయి. 

10 సెక్షన్లతో కేసు నమోదు చేశామని సీఈవో తెలిపితే... ఇంకా సిగ్గులేకుండా మంత్రి అంబటి, కాసు మహశ్ రెడ్డి వీటిని తప్పుబడుతున్నారు. సీఈవో చేసిన ప్రకటనను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారంటే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిపిస్తారా? అనే సందేహం కలుగుతోంది. 

రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో  రిటర్నింగ్ అధికారులను కూడా బెదిరిస్తున్నారు... కౌంటింగ్ నాడు మీ సంగతి చూస్తామంటూ వాళ్ల కుటుంబ సభ్యులను కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతుంటే సీఎస్ ఏం చేస్తున్నారు? 

తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ధనంజయరెడ్డి ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు. రఘురామరెడ్డి, సజ్జల, భార్గవ్ రెడ్డి, ఆంజనేయులు (ఇంటెలిజెన్స్) పర్యవేక్షణలో కొంతమంది పోలీసులను బెదిరించి ఇలాంటి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారు. పిన్నెల్లి దేశం వదిలిపెట్టి వెళ్లాడా? రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లాడా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? 

ప్రజావేదిక విధ్వంసంతో జగన్ చేసిన అరాచక పాలన ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసంతో పరిసమాప్తం అయింది. సాక్షి యాజమాన్యం, పత్రిక, చానల్ పై కేసులు నమోదు చేయాలి. ఈసీ, సీఈవో చెప్పిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్న వారిని అరెస్ట్ చేయాలి" అంటూ దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Devineni Uma
House Arrest
TDP
Chalo Macherla
  • Loading...

More Telugu News