KTR: తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు... ధిక్కార స్వరాలు: కేటీఆర్

KTR tweet about Rakesh Reddy

  • ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు కావాలన్న కేటీఆర్
  • ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి రాకేశ్ రెడ్డి ఆ ప్రశ్నించే గొంతు అన్న కేటీఆర్
  • ఉపఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేశ్ రెడ్డికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి

తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని... ధిక్కార స్వరాలు... ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి గురించి సుదీర్ఘంగా ట్వీట్ చేశారు.

హన్మకొండ జిల్లాలోని సామాన్య రైతు కుటుంబంలో రాకేశ్ రెడ్డి జన్మించారని, బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారని, మేనేజ్‌మెంట్ అండ్ ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలిపారు. అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేశ్ రెడ్డి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేశ్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ది డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించినట్లు వెల్లడించారు.

సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారని... పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేశ్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్‌ను రూపొందించి ఉచితంగా అందించారని తెలిపారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించినట్లు వెల్లడించారు.

టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారని... కరోనా సమయంలో, వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారని వెల్లడించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేశ్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్‌గా పేర్కొన్నారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించేతత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేశ్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని తెలిపారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేశ్ రెడ్డి గారికే వేసి.. వారిని గెలిపించాలని కోరుతున్నామని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News