Lakshmi Parvathi: ఈ దుర్మార్గురాలి వల్లే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi fires on Purandeswari

  • ఏపీలో హింసాత్మక ఘటనలు
  • అధికారుల బదిలీల్లో పురందేశ్వరి పాత్ర ఉందన్న లక్ష్మీపార్వతి
  • పాత అధికారులు వెళ్లిపోయిన చోటే  ఘటనలు జరిగాయని ఆరోపణ
  • చంద్రబాబు, పురందేశ్వరి ఇద్దరూ హంతకులే అంటూ విమర్శలు

ఏపీలో పోలింగ్ అనంతరం జరుగుతున్న పరిణామాలపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి స్పందించారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని అన్నారు. తాడిపత్రి వంటి చోట్ల ఇబ్బంది పెట్టారని, పల్నాడులో అయితే ముందు నుంచే గొడవలు ప్రారంభించారని తెలిపారు. 

ఎప్పుడైతే వీళ్లు (విపక్ష నేతలు) ఇచ్చిన జాబితా ప్రకారం అధికారులను మార్చారో, ఆ అధికారులు వెళ్లిపోయిన చోటే గొడవలు జరిగాయి అని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. కొత్తగా వచ్చిన పోలీసులు వాళ్లకు (విపక్షాలకు) సహకరించారని ఆరోపించారు. 

"ఎన్నికలు అయిపోయాక దారుణ ఘటనలు జరిగాయి. మనం లైవ్ లో చూస్తున్నాం కదా... కర్రలు, కత్తులు తీసుకుని ఇళ్ల మీదకు వెళ్లి దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టారు. ఇళ్లు ధ్వంసం చేయడం, కార్లు తగలబెట్టడం... ఇంత దారుణంగా ఏపీలో ఎప్పుడూ జరగలేదు. ఏపీలోనే ఇలా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడంతో ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది. ఈ జాగ్రత్త ముందే ఉంటే బాగుండేది. 

మంచి అధికారులను తీసేసి వృత్తికి ద్రోహం చేసే పనికిమాలిన వెధవలను పెడితే ఇలాగే జరుగుతుంది. కొందరు అధికారులను మార్చాలంటూ టీడీపీ వాళ్లు పురందేశ్వరికి లిస్టు అందజేశారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా, తమకు ఏ అధికారులు కావాలో కూడా జాబితా ఇచ్చారు. రాష్ట్రంలో ఈ విధమైన లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది ఈ దుర్మార్గురాలు పురందేశ్వరి వల్లనే కదా! 

నాకు తెలిసినంతవరకు కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను చంపేయడానికి వీళ్లు ప్లాన్ చేసుకున్నారు. కౌంటింగ్ నాటికి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తే, ఏజెంట్లు ఎవరూ రారు... మా ఇష్టం వచ్చినట్టు మేం చేసుకుంటాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. 

అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. అందుకు నిదర్శనంలా... వైసీపీ వాళ్లు  ఎక్కడా, ఎవరి మీద కూడా తగువుకు పోలేదు. ఎక్కడ చూసినా ఈ తెలుగుదేశం గూండాలే. చింతమనేనిని కూడా చూశాం. పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులను కూడా బెదిరించి, ఓ హత్య చేయబోయిన వ్యక్తిని తీసుకునిపోయాడు. 

ఇలాంటి వెధవలను పెంచి పోషిస్తున్న చంద్రబాబు, అతడికి వంతపాడుతున్న పురందేశ్వరి ఇద్దరూ కూడా నా దృష్టిలో హంతకులే. వీళ్లు ఎంత త్వరగా రాష్ట్రం నుంచి వెళ్లిపోతే అంత మంచిది" అంటూ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.

Lakshmi Parvathi
Daggubati Purandeswari
Chandrababu
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News