Hyderabad: ఏపీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న జనాలు... పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్

Heavy traffic jam at Panthangi toll gate

  • ఏపీ, తెలంగాణల్లో ముగిసిన పోలింగ్
  • ఓటు వేయగానే బస్సులు, కార్లు, టూవీలర్లపై హైదరాబాద్ తరలుతున్న ప్రజలు
  • హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచిన టోల్ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పోలింగ్ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఓట్లు వేసేందుకు రెండు రోజుల క్రితమే బయల్దేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. ఈరోజు పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. 

ఈరోజు మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, టూవీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వందల సంఖ్యలో వాహనాలు ఒకేసారి తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టింది. 

ఓటింగ్ నేపథ్యంలో ఈరోజు సెలవుదినం ప్రకటించారు. రేపు వర్కింగ్ డే కావడంతో ఈరోజే ప్రజలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్నారు.

స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంల తరలింపు

తెలంగాణలో పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. భారీ భద్రత నడుమ అధికారులు ఈవీఎంలను తరలిస్తున్నారు. ఈవీఎంలను జీపీఎస్ ఉన్న వాహనాల్లో తరలించారు.

Hyderabad
Telangana
Andhra Pradesh
Lok Sabha Polls
AP Assembly Polls
  • Loading...

More Telugu News