Social Media: చెరగని సిరాపై నాగబాబు ప్రచారాన్ని తప్పుబట్టిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

AP ceo clarification on On Indelible ink rumours

  • ఈ విషయంలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేయొద్దని హితవు
  • ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఈ సిరా ఉంటుందని స్పష్టీకరణ
  • నాగబూబు వీడియోపై ఫ్యాక్ట్ చెక్ పేరుతో ‘ఎక్స్’లో ప్రకటన విడుదల

చెరగని సిరా విషయంలో జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (ఏపీ సీఈవో) కార్యాలయం తప్పుబట్టింది. ఓటర్లను ఎన్నికలకు దూరం చేసేందుకు అధికార వైసీపీ డబ్బుతో వారిని ప్రలోభపెట్టి ముందుగానే చేతికి సిరా గుర్తు అంటిస్తోందంటూ నాగబాబు వీడియో విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఈ ఆరోపణలు నిజం కావని వీడియో సందేశంలో స్పష్టం చేశారని ఏపీ సీఈవో కార్యాలయం పేర్కొంది. భారత ఎన్నికల సంఘం నియమించిన అధికారులు మాత్రమే చెరగని సిరాను వాడే అధికారం కలిగి ఉన్నారని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో నాగబాబు వీడియో స్క్రీన్ షాట్ ను జత చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు అది నిజమో, కాదో ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని సూచించింది. వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై, కాంబాట్ మిస్ ఇన్ఫర్మేషన్ అనే హ్యాష్ ట్యాగ్ లను తమ పోస్ట్ కు జత చేసింది.


Social Media
ap ceo
indeligible ink
malicious campaign
cautions
voters

More Telugu News