Visakhapatnam: విశాఖ ఫ్లైఓవర్ పై అదుపుతప్పిన బైక్.. ఇద్దరు యువకులు మృతి.. వీడియో ఇదిగో!

Visakha NAD Flyover Road Accident

  • అతివేగం కారణంగా అదుపుతప్పి వాల్ ను ఢీ కొట్టిన బైక్
  • ఎగిరి కింద పడ్డ ముగ్గురు యువకులు
  • సీసీటీవీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు

విశాఖపట్నంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్ఏడీ ఫ్లైఓవర్ పై ఓ బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టింది. ఆ వేగానికి బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలతో ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోగా.. మూడో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సీసీటీవీ కెమెరా ఫుటేజీలో డ్యూక్ బైక్ ఒకటి వేగంగా దూసుకురావడం కనిపిస్తోంది. టర్నింగ్ లోనూ అదే వేగంతో వెళ్లడంతో బైక్ అదుపుతప్పి వాల్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ అక్కడే పడిపోగా.. యువకులు మాత్రం ఫ్లైఓవర్ నుంచి కిందపడ్డారు. పై నుంచి పడడంతో యువకులు ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు మూడో యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన యువకులను తనవరపు కుమార్, అరవెల్లి పవన్ కుమార్ గా గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిపారు.

Visakhapatnam
NAD Flyover
Road Accident
Flyover
Viral Videos

More Telugu News