YS Jagan: రేవంత్ రెడ్డి.... చంద్రబాబు మనిషి: కడపలో సీఎం జగన్ వ్యాఖ్యలు

Jagan alleges Revanth Reddy is Chandrababu man

  • కడపలో వైసీపీ ఎన్నికల ప్రచార సభ
  • చంద్రబాబు కోసం ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందన్న జగన్
  • కాంగ్రెస్ కు ఓటేస్తే ఎన్డీయేకి ఓటేసినట్టేనని వెల్లడి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి... అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో సీఎం జగన్ ప్రసంగించారు. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతూ, సొంత చెల్లెలు షర్మిలపై నిప్పులు చెరిగారు. 

వైఎస్సార్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని మండిపడ్డారు. "వైఎస్సార్ మరణం తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. నన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. ఇప్పుడు ఆయన సమాధి వద్దకు వెళతారంట! ఆయన చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారట! 

నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా? రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా? కాంగ్రెస్ కు ఓటేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్టే. కాంగ్రెస్ కు ఓటేయడం అంటే టీడీపీని గెలిపించడం కాదా?

వైఎస్సార్ వారసులంటూ వస్తున్న వారి కుట్రలను గమనిస్తున్నాం. వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు? మహానేత వైఎస్ఆర్ పేరు చార్జిషీట్ లో పెట్టింది ఎవరు? పైగా ఆయన పేరును మేమే చార్జిషీట్ లో పెట్టించామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన మీరా ఆయన వారసులు? 

నాకంటే 13 ఏళ్ల చిన్నవాడు అవినాశ్... చిన్నపిల్లాడి జీవితాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు తదితరులు కుట్రలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కడపలో రాజకీయ శూన్యతను సృష్టించి, ఆ శూన్యంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. వీళ్లసలు మనుషులేనా? అవినాశ్ ఎలాంటివాడో మీకందరికీ తెలుసు, అవినాశ్ ఎలాంటివాడో నాకు తెలుసు. అవినాశ్ కు బ్రహ్మాండమైన మెజారిటీ అందించి గెలిపించాలని కోరుతున్నా. 

రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కు ఓటేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించినట్టే అవుతుంది. చంద్రబాబును గెలిపించేందుకే ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. చంద్రబాబు పగలు బీజేపీతో కాపురం చేస్తారు, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారు" అంటూ జగన్ ప్రసంగించారు.

YS Jagan
Revanth Reddy
Chandrababu
Kadapa
YSRCP
Congress
NDA
YS Avinash Reddy
Sharmila
  • Loading...

More Telugu News