Harish Rao: రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సుమంది... రేవంత్ రెడ్డి వెళ్లి బతిమాలినా ఎవరూ రాలేదు: హరీశ్ రావు

Harish Rao says Rahul Gandhi meeting failed

  • సరూర్ నగర్ మీటింగ్‌లో 30వేల కుర్చీలు వేసి కూలర్లు పెడితే 3 వేల మంది రాలేదన్న హరీశ్ రావు
  • అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్, ప్రియాంకలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్న
  • కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్య

నిన్న సరూర్‌నగర్‌లో నిర్వహించిన రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సుమందని.. 30 వేల కుర్చీలు వేసి కూలర్లు పెడితే పట్టుమని మూడు వేలమంది కూడా రాలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి పోయి లోపలకు రమ్మని బ్రతిమిలాడినా ఎవరూ రాలేదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా ఆయన ఈ రోజు ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ప్రియాంకగాంధీ హుస్నాబాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పారని, రాహుల్ గాంధీ వచ్చి మహిళల ఖాతాల్లో రూ.2500 వేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆ హామీలు నెరవేరలేదని, వారు అబద్దాల గాంధీలుగా మారారని ఎద్దేవాచేశారు. 

కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పారని, ఐదు నెలలు అవుతున్నా దిక్కులేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిరంతర విద్యుత్ ఇస్తే, ఇప్పుడు కరెంట్ పోతోందన్నారు. రైతులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్‌ అయిందని.. తులం బంగారం తుస్సుమందని చురక అంటించారు. హామీలను గాలికి వదిలేశారన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, ధాన్యానికి రూ.500 బోనస్ రాలేదన్నారు.

Harish Rao
BRS
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News