Etela Rajender: రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, మార్ఫింగ్‌ ల తో కేసీఆర్‌ను మించిపోయారు: ఈటల రాజేందర్

Etala Rajendar says Phone Tapping congress government

  • రేవంత్ రెడ్డి ఓ అబద్ధాలకోరు అని నాలుగు నెలల్లోనే ప్రజలకు అర్థమైందని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్య
  • ఇండియా కూటమిలో ప్రధాని ఎవరు అవుతారో వారికే తెలియదని ఎద్దేవా 

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి వీడియో, ఆడియోలు మార్ఫింగ్ చేసి కేసీఆర్‌ను మించిపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ అబద్ధాలకోరు అని నాలుగు నెలల్లోనే ప్రజలకు అర్థమైందన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావని... వారికి ఆ విషయం తెలియడం లేదన్నారు. ఏ సర్వే సంస్థకూ అందని ఫలితాలు మల్కాజ్‌గిరిలో వస్తాయన్నారు. మైనార్టీలు కూడా బీజేపీకే ఓటు వేస్తారని పేర్కొన్నారు. తన ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఇతర ఏ హామీని కాంగ్రెస్ నేరవేర్చలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకోకుండా కమిటీ పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఐదు నెలల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని... అందుకే ఓట్లు పడవని తెలిసి రైతు భరోసా నిధులు ఇప్పుడు విడుదల చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో ఒరిగేదేమీ లేదన్నారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించిందే మోదీ అని గుర్తు చేశారు. కానీ బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని అబద్దపు ప్రచారం చేస్తోందన్నారు. ఇండియా కూటమిలో ప్రధాని ఎవరు అవుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లిందని... రాహుల్ గాంధీ ప్రధాని కాలేరన్నారు.

Etela Rajender
Congress
BJP
Telangana
  • Loading...

More Telugu News