Chandrababu: ఇతడేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలా?: చంద్రబాబు

Chandrababu said a chance has come to hand Jagan

  • ఏలూరు జిల్లా నూజివీడులో ప్రజాగళం సభ
  • ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడంటూ చంద్రబాబు ధ్వజం
  • ఇతడేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలా? అంటూ ఆగ్రహం

ఏలూరు జిల్లా నూజివీడు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? తన కోసం తాను పనిచేస్తున్నాడు అంటూ ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటతాయి... చేతలు గడప కూడా దాటవు అని అన్నారు. 

ఇతడు ఒక మోసకారి, ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక బందిపోటు దొంగ... అతడి దృష్టిలో మనమంతా బానిసలం... అతడొక నియంత అంటూ వ్యాఖ్యానించారు. డబ్బులన్నీ తన వద్దే ఉండాలని ఈ నియంత ఆలోచిస్తాడు... అతడేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలి అని చంద్రబాబు మండిపడ్డారు. 

"ఈ అహంకారికి  బుద్ధి చెప్పాలి. మే 13న ఫ్యాన్ ను చిత్తు చిత్తుగా చితక్కొట్టి చెత్తబుట్టలో పడేయాలి. మళ్లీ రాతియుగం పోయి స్వర్ణ యుగం రావాలి. ఇది జరగాలంటే నూజివీడులో టీడీపీకి ఓట్లేయాలి. నీకు అధికారం ఇచ్చిన ఐదేళ్లు అయిపోయాయి. మే 13తో నీ డేట్ ముగిసింది. నీ అధికారానికి చెల్లు చీటీ... పవన్ కల్యాణ్ ఒక మాట అన్నాడు... హలో ఏపీ, బై బై జగన్! 

నేను అధికారంలోకి వస్తానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. రెండో సంతకం... జగన్ లాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపైనే. సైకో జగన్... మా భూములు నీ అధీనంలో ఉంచుకోవడం ద్వారా మా జుట్టు నీ చేతుల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నావు. మా మెడకు ఉరితాడు వేసి ఆ తాడు నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు... అందుకే ఈ నల్ల చట్టాన్ని చించి చెత్తబుట్టలో పడేస్తున్నాను. 

ఇప్పుడు జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది... అదెప్పుడు... మే 13వ తేదీన. వైసీపీకి, ఫ్యాన్ కు ఉరేయండి... సైకిల్ కు పట్టం కట్టండి... అక్కడ్నించి మీ జీవితాలు అన్ స్టాపబుల్... ఎవడు అడ్డం వస్తాడో చూస్తా. మీకు అండగా నేను ఉంటా.

నాడు అమరావతిని ప్రపంచంలో పెట్టాలని ముందుకెళ్లాను. ఈ దుర్మార్గుడు వచ్చి అమరావతిని సర్వనాశనం చేశాడు. అమరావతి వచ్చి ఉంటే నూజివీడు వారికి కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. అమరావతి వచ్చి ఉంటే అవుటర్ రింగ్ రోడ్డు నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు వెళ్లేది. ఇతడు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. నేను అధికారంలోకి వస్తూనే అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తా. అందులో నూజివీడు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది అమరావతిలో ఒక భాగంగా ఉంటుంది.

ఇవాళ జగన్ మాట్లాడుతున్నాడు... ఆయన పేదవాళ్ల పక్షం అంట! పేదవాళ్లను సర్వనాశనం చేసిన వ్యక్తి ఇతడు. మాట్లాడితే క్లాస్ వార్ అంటున్నాడు... క్లాస్ వార్ కాదు ఇది క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే డబ్బంతా తాడేపల్లి కొంపకి పోయింది... ఆ డబ్బులు మీవి. 

జగన్ మోహన్ రెడ్డికి ప్యాలెస్ లు... ప్రజలకేమో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు! నీకు ఒక్కో ప్యాలెస్ లో 100 బెడ్రూంలు... ఇది మీ తాతా జాగీరు అనుకుంటున్నావా? వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న నువ్వు పేదల ప్రతినిధినని చెప్పుకోవడానికి సిగ్గుండాలి" అంటూ  చంద్రబాబు ధ్వజమెత్తారు.

Chandrababu
Nuziveedu
Praja Galam
TDP
Jagan
YSRCP
  • Loading...

More Telugu News