BJP: బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సింగ్ కన్నుమూత

BJP MP candidate Kunwar Sarvesh Singh passed away

  • ఎయిమ్స్‌లో గుండెపోటుతో మృతి
  • గొంతు సమస్యకు ఇటీవలే ఆపరేషన్.. చెకప్ కోసం హాస్పిటల్‌లో చేరిక
  • వెల్లడించిన యూపీ బీజేపీ చీఫ్
  • మొరాదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన కున్వర్ సింగ్
  • తొలి దశలో భాగంగా మొరాదాబాద్‌లో శుక్రవారమే ముగిసిన పోలింగ్

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన కున్వర్ సర్వేశ్ సింగ్ మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయనకు గొంతు సమస్య ఉందని, గతంలోనే ఆపరేషన్ చేయించుకున్నారని, చెకప్ కోసం శనివారం ఎయిమ్స్‌కు వెళ్లారని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి వెల్లడించారు. ఎయిమ్స్‌లో గుండెపోటుతో మరణించారని మొరాదాబాద్ సిటీ బీజేపీ ఎమ్మెల్యే రితేష్ గుప్తా నిర్ధారించారు. అనారోగ్యానికి గురవ్వడంతో హాస్పిటల్‌కు వెళ్లారని చెప్పారు.

కాగా మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19న పోలింగ్ ముగిసింది. ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి రుచి వీరతో  కున్వర్ సింగ్ తలపడ్డారు. 2014లో మొరాదాబాద్ ఎంపీగా గెలిచారు. అంతకుముందు మొరాదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం
కున్వర్ సర్వేశ్ సింగ్ అకాల మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కున్వర్ సింగ్ తన తుదిశ్వాస వరకు ప్రజాసేవ, సామాజిక సేవకే అంకితమయ్యారని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి అమిత్ షా కూడా కున్వర్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కష్టపడి పనిచేసే మనిషి అని, ప్రజాదరణ కలిగిన నాయకుడు అని కొనియాడారు.

BJP
Kunwar Sarvesh Singh
Lok Sabha Polls
Narendra Modi
  • Loading...

More Telugu News