Narendra Modi: ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

PM Modi defends scrapped electoral bonds scheme

  • ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చామన్న ప్రధాని
  • వాస్తవిక పరిస్థితులు ప్రతిబింబించినప్పుడు ప్రతిఒక్కరూ పశ్చాత్తాపపడతారని వ్యాఖ్య
  • ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం చిన్న ప్రయత్నం చేసిందన్న మోదీ

సుప్రీంకోర్టు తీర్పుతో రద్దు అయిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన స్కీమ్ ఇదని అన్నారు. వాస్తవికమైన పరిస్థితులు ప్రతిబింబించినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడతారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఒక నిర్ణయానికి సంబంధించి లోటుపాట్లు ఉండబోవని తాను ఎప్పుడూ చెప్పలేదని మోదీ అన్నారు. ఎన్నికల్లో నల్లధనం చాలా ప్రమాదం అని చాలా కాలంగా చర్చ జరుగుతోందని, ముగింపు పలకాలంటూ చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయని మోదీ ప్రస్తావించారు.

‘‘ఎన్నికల్లో అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. నా పార్టీ కూడా ఖర్చు పెడుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టే ఈ డబ్బుని జనాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎన్నికల్లో ఈ నల్లధనం నుంచి ఎలా విముక్తి లభిస్తుంది? పారదర్శకత ఎలా వస్తుంది? మా ప్రభుత్వం ఒక చిన్న మార్గాన్ని అన్వేషించింది. ఇది సంపూర్ణమైన మార్గం అని మేము ఎప్పుడూ చెప్పలేదు’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

రాజకీయ విరాళాలన్నింటినీ చెక్కుల రూపంలో తీసుకోవాలని గతంలో బీజేపీ నిర్ణయించిందని, అయితే వ్యాపారవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని మోదీ చెప్పారు. ఈ విధానం ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుందని అందుకే వెనక్కి తగ్గామని చెప్పారు. విరాళాల విషయంలో 1990 దశకంలో బీజేపీకి చాలా సమస్యలు ఎదురయ్యాయని మోదీ ప్రస్తావించారు. ఈ పరిస్థితులు అన్నీ తనకు తెలుసునని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ లేకపోతే డబ్బు ఎలా వచ్చిందో, ఎక్కడికి పోయిందో తెలుసుకునే అధికారం ఏ వ్యవస్థకు ఉంటుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని, భావవ్యక్తీకరణ హక్కుపై కూడా ప్రభావం చూపుతోందని పేర్కొన్న విషయం తెలిసిందే.

Narendra Modi
Electoral bonds scheme
Supreme Court
Elections
  • Loading...

More Telugu News