IPL 2024: విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమానిని చితకబాదిన స్టేడియం సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!
![Security Officials Beat Up Fan Who Invaded Pitch To Touch Virat Kohli Feet During RCB vs PBKS IPL 2024 Match](https://imgd.ap7am.com/thumbnail/cr-20240327tn6603f0f49f390.jpg)
- సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించిన అభిమాని
- అభిమానిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లి చితకబాదిన స్టేడియం సిబ్బంది
- ఈ నెల 25వ తేదీన ఆర్సీబీ, పీబీకేఎస్ మధ్య మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఘటన
ఈ నెల 25వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య జరిగిన మ్యాచ్లో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ సమయంలో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ వద్దకు పరిగెత్తుకువచ్చిన ఆ ఫ్యాన్.. కోహ్లీ కాళ్లు మొక్కడంతో పాటు కౌగిలించుకున్నాడు. అంతలోనే అక్కడి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడిని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. అలా స్టేడియం బయట అభిమానిపై సిబ్బంది చేయిచేసుకున్న వీడియో కాస్తా ఇప్పుడు బయటకు వచ్చింది. దాంతో ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహాన్ని తప్పుపడుతుంటే.. మరికొందరు మాత్రం వారి డ్యూటీ వారు చేశారని సమర్థిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 49 బంతుల్లోనే 77 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్ కారణంగా బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. చివరలో దినేష్ కార్తీక్ 10 బంతుల్లోనే 28 పరుగులతో రాణించడం కూడా ఆర్సీబీకి మరింత కలిసొచ్చింది.