Revanth Reddy: ఏళ్లుగా తిష్టవేసిన అధికారులను బదిలీ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy review on mining

  • నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కు ప‌న్ను వ‌సూలు సాధించాలని అధికారులకు సూచన
  • నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ ర‌వాణా అరిక‌ట్టాలని ఆదేశాలు
  • వాణిజ్య ప‌న్నులు, రిజిస్ట్రేష‌న్ శాఖకు సొంత భ‌వ‌నాలు ఉండాలన్న సీఎం
  • స‌మ‌గ్ర‌మైన ఇసుక విధానంతో అక్ర‌మాల‌ను అడ్డుకోవాలని సూచన
  • గ‌నుల శాఖ విధించిన జ‌రిమానాలు వ‌సూలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి

టీఎస్ ఎండీసీతో పాటు గ‌నులశాఖ‌లో ప‌లువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల త‌ర‌బ‌డి తిష్ట వేశార‌ని, కొంద‌రిపై ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వారిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదేశించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై స‌చివాల‌యంలో ఈ రోజు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌న్నారు.

వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌న్ను ల‌క్ష్యానికి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఎందుకు ఉంది? అని సీఎం ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది వ‌ర‌కు జీఎస్టీ ప‌రిహారం కింద రూ.4 వేల కోట్ల‌కు పైగా చెల్లించేద‌ని, దాని గ‌డువు ముగియ‌డంతో ఆ నిధులు రాక‌పోవ‌డంతో రాబ‌డిలో వ్య‌త్యాసం క‌నిపిస్తోంద‌ని అధికారులు తెలిపారు.

ఆ మద్యం రాకుండా అడ్డుకోవాలని ఆదేశం

పొరుగు రాష్ట్రాల నుంచి నాన్-డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని సీఎం ఆదేశించారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాల‌కు సంబంధించి లెక్క‌ల్లో తేడాలు ఉంటున్నాయ‌ని, వీటిపట్ల క‌ఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్ర‌తి డిస్ట‌ల‌రీ వ‌ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు జీపీఎస్ అమ‌ర్చి వాటిని ట్రాకింగ్ చేయాల‌ని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం ఉండాల‌ని, మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాలు వే-బిల్లులు క‌చ్చితంగా ఉండాల‌ని సీఎం ఆదేశించారు. నాన్-డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్‌తో పాటు గ‌తంలో న‌మోదు చేసిన ప‌లు కేసుల పురోగ‌తిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష

రిజిస్ట్రేష‌న్ల శాఖ‌పై స‌మీక్ష సంద‌ర్భంలో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు, జిల్లా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగుతున్నాయని అధికారులు తెలిపారు. అదే స‌మ‌యంలో త‌మ‌ శాఖలోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ టి.కె.శ్రీ‌దేవి ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదాయాన్ని తెచ్చే శాఖల‌కు సొంత భ‌వ‌నాలు ఉండాలని, ప్రస్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న భ‌వ‌నాలు నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. అలాగే హైద‌రాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌తో పాటు న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై కంక‌ర కుప్పలుగా పోసి విక్ర‌యిస్తున్నార‌ని, అలా కాకుండా న‌గ‌రంలో వివిధ ప్ర‌దేశాల్లో ప్ర‌భుత్వ స్థ‌లాలను వినియోగించాల‌ని సూచించారు.

ఇసుక విక్ర‌యాల‌పై స‌మ‌గ్ర విధానం రూపొందించాలి

ఇసుక విక్ర‌యాల‌పై స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వే-బిల్లుల‌తో పాటు ఇసుక స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు ట్రాకింగ్ ఉండాల‌ని, అక్రమ ర‌వాణాకు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌న్నారు. నిబంధ‌న‌ల ఉల్లంఘన కింద ప‌లు గ‌నుల‌పై గ‌తంలో జ‌రిమానాలు విధించార‌ని, కేసులు న‌మోదు చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ జ‌రిమానాల‌ను వెంట‌నే వ‌సూలు చేయాల‌న్నారు. గ‌తంలో జ‌రిమానాలు విధించి త‌ర్వాత వాటిని త‌గ్గించార‌ని, అందుకు కార‌ణాలు ఏమిటో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని అధికారుల‌కు సూచించారు.

  • Loading...

More Telugu News