Somireddy Chandra Mohan Reddy: వేమిరెడ్డి దంపతులను టీడీపీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం: సోమిరెడ్డి

Somireddy welcomes Vemireddy into TDP

  • నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేడు కీలక పరిణామం
  • వైసీపీకి గుడ్ బై చెప్పిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • వీడియో సందేశం వెలువరించిన సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాసేపటికే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ వీడియో సందేశం వెలువరించారు. వేమిరెడ్డి దంపతులకు టీడీపీ ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. 

"రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కొద్దిసేపటి కిందటే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చూశాం. నాకు అర్థమైంది ఏంటంటే... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పది రూపాయలు దానం చేసేవాడు, పది మందికీ సాయపడేవాడు. వీపీఆర్ కన్వెన్షన్ పక్కన పేద పిల్లల కోసం చక్కని స్కూలు కట్టించాడు. ఒక్క రూపాయి తీసుకోకుండా చదువుకునే అవకాశం కల్పిస్తున్నాడు. 

దేవాలయాలకు దానధర్మాలు, జిల్లా అంతటా మంచినీటి ప్లాంట్లతో విరివిగా సేవలు అందిస్తుంటారు. ఆయనేమీ కుట్రలు, కుతంత్రాలు తెలిసిన సగటు రాజకీయ నాయకుడు కాదు. అటువంటి వ్యక్తి వైసీపీలో ఇమడలేకపోయాయడంటే ఆ పార్టీ పోకడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో, జిల్లాలో మంత్రులు కూడా అదే తీరున ఉన్నారు. అందుకే వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో, వేమిరెడ్డి దంపతులు ఇద్దరూ టీడీపీలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం" అంటూ సోమిరెడ్డి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Somireddy Chandra Mohan Reddy
Vemireddy Prabhakar Reddy
TDP
YSRCP
Nellore District
  • Loading...

More Telugu News