3 Idiots: మధ్యప్రదేశ్‌లో ‘త్రీ ఇడియట్స్’.. ఆసుపత్రిలో ఆమీర్‌ఖాన్ సినిమాను తలపించే సీన్

3 Idiots scene recreated in Madhya Pradesh

  • సత్నా జిల్లా ఆసుపత్రిలో ఘటన
  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తాతను బైక్‌పై నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లిన వైనం
  • ఆసుపత్రిలో గందరగోళం
  • తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు
  • తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

2009లో వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్ కామెడీ డ్రామా ‘త్రీ ఇడియట్స్’ చూశారా? అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడి తండ్రిని ఆమిర్‌ఖాన్ బైక్‌పై నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్తాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఆసుపత్రిలో శనివారం రాత్రి ఇలాంటి ఘటనే జరిగింది.

ఎమర్జెన్సీ వార్డులో ఆన్ డ్యూటీ సిబ్బంది, రోగులు, వైద్యులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తాతను బైక్‌పై తీసుకొచ్చిన ఓ వ్యక్తి నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి పోనిచ్చాడు. అది చూసిన అందరూ షాకయ్యారు. 

బైక్‌ను నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చిన వ్యక్తిని నీరజ్ గుప్తాగా గుర్తించారు. సెక్యూరిటీ గార్డులు ఈ మొత్తం ఘటనను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. బైక్‌పై తాతను మధ్యలో కూర్చుబెట్టుకోగా, వెనక అతడి స్నేహితుడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. నీరజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు ఆయనతో గొడవపడడంతో ఆసుపత్రిలో కొంత గందరగోళం ఏర్పడింది. 

నీరజ్ అదే ఆసుపత్రిలో పేషెంట్లకు అడ్మిషన్ స్లిప్‌లు ఇచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో నీరజ్ బైక్ రివర్స్ చేసి ఆసుపత్రి నుంచి బయటకు రావడం కూడా కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రి వార్డులోకి నేరుగా బైక్‌పై ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించేందుకు స్ట్రెచర్లు, ప్రత్యేకంగా సిబ్బంది ఉండగా కూడా ఇలా చేయడం తగదని, నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

3 Idiots
Madhya Pradesh
Satna District
Emergency Ward
  • Loading...

More Telugu News