YS Sharmila: ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల

Sharmila pays tributes at YSR Ghat in Idupulapaya

  • ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకం
  • ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన వైఎస్సార్ తనయ
  • వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలన్న షర్మిల
  • రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు పోరాటం ఆగదని వెల్లడి

ఏపీ పీసీసీ నూతన చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఇడుపులపాయ వచ్చారు. ఇక్కడి ఎస్టేట్ లోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ఇవాళ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చానని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ  సిద్ధాంతాలు అన్నా ప్రాణంతో సమానం అని తెలిపారు. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్లేవారని పేర్కొన్నారు. 

"భారతదేశంలో ఇవాళ లౌకికవాదం అనే పదానికి, బహుజనవాదం అనే పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది, రాజ్యాంగానికి అర్థమే లేకుండా పోయింది. ఇలాంటివన్నీ మళ్లీ నెలకొనాలి, కాంగ్రెస్ పార్టీ  సిద్ధాంతాలు నిలబడాలి... భారతదేశానికి మంచి జరగాలి, వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాం. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను. వైఎస్సార్ కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంతవరకు... నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం" అంటూ షర్మిల ప్రసంగించారు.

అనంతరం, మాజీ మంత్రి అహ్మదుల్లాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తదితరులు కూడా పాల్గొన్నారు.

YS Sharmila
YS Rajasekhar Reddy
Idupulapaya
Congress
Andhra Pradesh
  • Loading...

More Telugu News