Revanth Reddy: లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ భేటీ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!

CM Revanth Reddy and MIM MLA Akbaruddin meet in London

  • తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఇరువురి సమావేశం
  • మూసీ నది ప్రక్షాళన మాటున ఇరు పార్టీల మధ్య మైత్రి కోసం ప్రయత్నమంటూ చర్చ
  • పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ విశ్లేషణలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇరువురు లండన్‌లో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ‘హలో లండన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

లండన్ పర్యటనకు అక్బరుద్దీన్‌కు అధికారికంగా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుందని చెబుతున్నారు. ఇప్పుడు లండన్ పర్యటనలో రేవంత్, అక్బరుద్దీన్ భేటీ కావడం చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏం జరగబోతోందనే చర్చ మొదలైంది. మూసీ నది ప్రక్షాళన పేరిట కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్నేహం కుదరబోతోందని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంను కలుపుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కాగా థేమ్స్ నది నిర్వహణపై అధికారులు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయ్యింది. మూసీ సుందరీకరణ, పునరుద్దరణ కోసం అధ్యయనం చేసేందుకు కీలక చర్చలు జరిపారు. మూసీ పరీవాహక అభివృద్ధే లక్ష్యంగా చర్చలు జరిపారు. థేమ్స్ నది చరిత్ర, సుందరీకరణలో ఎదురైన సవాళ్ల గురించి సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు.

Revanth Reddy
MIM
Akbaruddin Owaisi
London
Davos visit

More Telugu News