Kesineni Nani: అహంకారంతో చంద్రబాబుపై నిందలేసిన కేశినేని నానికి కాలమే సమాధానం చెబుతుంది: టీడీపీ నేత నెట్టెం రఘురాం

Former Minister Raghuram fires at Keshineni Nani

  • టీడీపీ అధికారంలో ఉండి... తాను ఎంపీగా ఉన్నప్పుడు కేశినేని నానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ చురక
  • రెండోసారి ఆయన ఎంపీగా గెలిచాక ఇబ్బందులు వచ్చాయా? అని నిలదీత
  • పార్టీ నిర్ణయాలు... కార్యక్రమాల్లో తనను అందరికంటే అతీతుడిగా ఊహించుకుంటాడని ఆరోపణ
  • జగన్ అరాచకవాది... కేశినేని అవకాశవాది అంటూ విమర్శలు
  • పార్టీపై అభిమానం ఉంటే చంద్రబాబును విమర్శించేవాడు కాదని వ్యాఖ్య

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత నెట్టెం రఘురాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అహంకారంతో చంద్రబాబు, లోకేశ్‌లపై నిందలు వేసి... అమరావతిని అవహేళన చేసిన ఎంపీకి కాలమే తగిన సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉండి... నాని ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు... సమస్యలు లేవని.. కానీ రెండోసారి గెలిచాక ఇబ్బందులు వచ్చాయా? అని విమర్శించారు.

"నాని రెండోసారి ఎంపీగా గెలిచాక స్థానిక టీడీపీ నాయకులతో,  కార్యకర్తలతో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. తానే విజయవాడకు అధిష్ఠానం అన్న విధంగా పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించారు. పార్టీ నిర్ణయాలు, కార్యక్రమాలలో ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ, తనను తాను అందరికంటే అతీతుడిగా ఊహించుకుంటూ ముందుకెళ్లాడు. మహానాడుకు హాజరుకాకపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటివి చూశాం. చాలా సంవత్సరాలుగా పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశారు. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ పార్టీ పట్ల, నాయకుల పట్ల నిర్లక్ష్యధోరణితో వ్యవహరించారు. ట్రావెల్స్ వ్యాపారంలో నష్టపోయానని... రూ.2వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని కూడా నాని అన్నారు. కానీ దాని వెనుకున్న వ్యక్తులు, కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. పదేళ్లపాటు గౌరవమైన లోక్ సభ సభ్యుడిగా కొనసాగే అవకాశమిచ్చిన చంద్రబాబుని తప్పుపట్టారు" అంటూ మండిపడ్డారు.

అరాచకవాది.. అవకాశవాది ఇద్దరూ సరిపోతారు

తన స్వార్థం కోసం నేడు అరాచకవాది పక్కన కేశినేని నాని చేరారని విమర్శించారు. నాని అవకాశవాది అయితే... జగన్ అరాచకవాది... ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోతారని చురక అంటించారు. ముందుగా మాట్లాడి ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చాకే నాని... నిన్న ముఖ్యమంత్రిని కలిశాడని అర్థమైందన్నారు. నాని తనకు తాను తెలుగుదేశాన్ని దూరం పెట్టారు తప్ప... ఏ సందర్భంలోనూ పార్టీ ఆయనను దూరం పెట్టలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సమక్షంలో ఒకలా ఉంటూ, బయటకు వెళ్లాక తనకు నచ్చినట్టు నియంతృత్వ పోకడలతో నాని వ్యవహరించడాన్ని ఇన్నాళ్లుగా టీడీపీ భరించిందన్నారు. ఇన్నాళ్లు నానితో కలిసి ఉన్నవారంతా టీడీపీలోనే ఉంటారని... ఆయనతో కలిసి వెళ్లడానికి సుముఖంగా లేరన్నారు. టీడీపీని వీడాక తన పరిస్థితి ఏమిటనేది నానికి భవిష్యత్‌లో బోధపడుతుందని హెచ్చరించారు.
            
అంబటి రాయుడు వైసీపీని ఎందుకు వీడారో.. సాక్షిలో రాస్తే బాగుండేది

నాని టీడీపీ నుంచి వెళ్లిపోవడాన్ని  భూతద్దంలో చూపిస్తూ సాక్షి పత్రిక అసత్యాలు వండివార్చిందని... నానిని వాడుకునే క్రమంలో సాక్షి మీడియా తెలుగుదేశం పార్టీని, నాయకత్వాన్ని కించపరిచేవిధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నానిని టీడీపీ డబ్బులు అడిగిందని... ఎంపీ టిక్కెట్ కోసం రూ.150 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేసిందని, ఆ మొత్తం ఆయన ఇవ్వనన్నందుకే బయటకు వెళ్లిపోయేలా చేశారని సాక్షి పత్రికలో విషపు రాతలు రాశారని ధ్వజమెత్తారు. అదే సాక్షి మీడియా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి ఎందుకు గుడ్ బై చెప్పాడో, దానివెనకున్న కథాకమామీషు ఏమిటో కూడా ప్రజలకు తెలియచేస్తే బాగుంటుందని సూచించారు.

అప్పుడు ఒకలా... ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు

నిజంగా నానికి పార్టీపై ప్రేమ, అభిమానం, బాధ్యత ఉంటే మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటే చంద్రబాబుని విమర్శించేవాడు కాదన్నారు. తిరువూరు నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని, ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారని చంద్రబాబు..  నానికి చెప్పారని.. కానీ అధినేత సూచనను ధిక్కరించి నాని తిరువూరులో జరిగిన రా.. కదిలిరా సభకు రావడం.. అక్కడ గొడవ జరగడం అందరూ చూశారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 నాని వెంట నడిచేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు ఆదేశాలతో తాను... ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొనకళ్ల నారాయణ గతంలో నానిని కలిసి పార్టీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నామని... ఆ సమయంలో తాను సర్దుకుపోతానని నాని చెప్పాడని గుర్తు చేశారు. కానీ తర్వాత మాటమార్చి తనకు అవమానం జరిగిందని చెప్పాడని దుయ్యబట్టారు. పార్టీని వీడటం.. వైసీపీలో చేరడం నాని వ్యక్తిగతం... కానీ టీడీపీలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడటంపై మాత్రం ఆలోచన చేయాలని సూచించారు. తనను ఎంపీని చేసి, పదవిచ్చి గౌరవించిన చంద్రబాబుని, పార్టీ కోసం శ్రమిస్తున్న లోకేశ్‌ను నాని నిందించడాన్ని ప్రజలు హర్షించరన్నారు. ప్రజలు టీడీపీని చూస్తారు తప్ప.. వ్యక్తులను కాదని.. ఈ విషయం నానికి త్వరలో అర్థమవుతుందన్నారు.

Kesineni Nani
Telugudesam
Andhra Pradesh
Vijayawada
  • Loading...

More Telugu News