Adani: సుప్రీం తీర్పుపై గౌతమ్ అదానీ స్పందన

Gautam Adani Reaction On Top Court Verdict

  • సత్యమేవ జయతే.. నిజమే గెలుస్తుందంటూ ట్వీట్
  • సుప్రీంకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందన్న అదానీ
  • దేశాభివృద్ధికి అదానీ గ్రూప్ తోడ్పాటు కొనసాగుతుందని వెల్లడి
  • కోర్టు తీర్పుతో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ ధరల్లో పెరుగుదల

హిండెన్ బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ట్విట్టర్లో స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఎన్నటికైనా నిజమే గెలుస్తుందని అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు మరోసారి నిరూపించిందని చెప్పారు. ఈ వ్యవహారంలో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ గౌతమ్ అదానీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం అందరిదని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటూ అదానీ గ్రూప్ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

అదానీ గ్రూప్ షార్ట్ సెల్లింగ్ కు పాల్పడిందంటూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ కంపెనీ నివేదిక వెలువరించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారానికి సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దర్యాఫ్తు చేసి అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. మరికొన్ని ఫిర్యాదులను సెబీ ఇంకా దర్యాఫ్తు చేస్తోంది. అయితే, సెబీ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా.. వాటిని విచారించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్ కు సెబీ ఇచ్చిన క్లీన్ చిట్ ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

అదానీ - హిండెన్ బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో అదానీ గ్రూప్ స్టాక్స్ ధరలు పెరుగుతున్నాయి. కొనుగోలుకు డిమాండ్ పెరగడంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్ షేర్ల ధరలు 14 శాతం పెరిగాయి. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ వాల్యూ 11 శాతం, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్ ధరలు 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో అదానీ గ్రూప్ ఇన్వెస్టర్ల సంపదను ఒక్కరోజే 1.18 లక్షలు పెంచింది. ఇక అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15.62 లక్షలకు చేరింది.

Adani
Adani Group
Gautam Adani
adani tweet
Supreme Court
adani stocks
Adani Shares

More Telugu News