sajjanar: మరిన్ని కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్..: శుభవార్త చెప్పిన సజ్జనార్

Sajjanar says 80 new buses launching tomorrow

  • 80 బస్సులను రేపు ప్రారంభిస్తున్నట్లు సజ్జనార్ ట్వీట్
  • అందుబాటులోకి కొత్త ఎక్స్‌ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు
  • అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ప్రారంభిస్తామని వెల్లడి

ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని ట్వీట్ చేశారు. రూ.400 కోట్ల వ్యయంతో వెయ్యికి పైగా అధునాతన డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 80 బస్సులను రేపు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

'ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది' అని ఆయన ట్వీట్ చేశారు.

అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వాడకంలోకి వస్తున్నాయని... వాటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులు ఉన్నట్లు తెలిపారు. ఈ కొత్త బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.

  • Loading...

More Telugu News