Nara Lokesh: 'వ్యూహం' చిత్రంపై సివిల్ కోర్టులో నారా లోకేశ్ పిటిషన్

Nara Lokesh files petition against Vyuham movie

  • రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం చిత్రం
  • చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలంటూ లోకేశ్ పిటిషన్
  • సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబును అపఖ్యాతి పాల్జేసేందుకే ఈ సినిమా తీశారని ఆరోపణ  

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్రాన్ని విడుదల చేయకుండా నిర్మాతలను ఆదేశించాలని తన పిటిషన్ లో కారు. అంతేకాదు, వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, రామదూత క్రియేషన్స్, సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీలను లోకేశ్ తన పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటివరకు నీతినిజాయతీతో కొనసాగారని, ఈ చిత్రం ద్వారా ఆయనను అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ వివరించారు. 

తమ రాజకీయ ప్రత్యర్థి జగన్ కు మేలు చేసేలా ఈ చిత్రం ఉందని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టమని... చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటే తనకు నచ్చదని రామ్ గోపాల్ వర్మ చెప్పారని లోకేశ్ తన పిటిషన్ లో స్పష్టం చేశారు. తనకు నచ్చిన విధంగా ఈ సినిమాలో పాత్రలను నిర్ణయించారని, ట్రైలర్ చూపినట్టే సినిమా అంతే ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. 

ఈ చిత్ర దర్శకనిర్మాతలు గతంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి చిత్రాలు తీశారని, వారికి ఆయా చిత్రాలతో ఎలాంటి లాభాలు రాకపోయినా ఇప్పుడు వ్యూహం చిత్రం తీశారని లోకేశ్ వివరించారు. నష్టపోతామని తెలిసినా జగన్ కు లబ్ది చేకూర్చేందుకు ఈ సినిమా తీశారని, ఈ సినిమా నిర్మాణం వెనుక జగన్ ఉన్నారని ఆరోపించారు. 

వాక్ స్వాతంత్ర్యం అంటూ దర్శక నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, అందువల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే కాదు, టీడీపీ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటోందని పేర్కొన్నారు. 

Nara Lokesh
Vyuham
Petition
Telangana High Court
Ram Gopal Varma
Chandrababu
Jagan
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News