Team India: వన్డే సిరీస్ మనదే.. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం

Team India won the third ODI and wons ODI series

  • బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ మెరుపులు
  • 297 పరుగుల లక్ష్య ఛేదనలో 218 పరుగులకే ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా
  • 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా

బ్యాటింగ్‌లో సంజూశాంసన్, బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ రాణించడంతో పార్ల్ వేదికగా జరిగిన మూడవ వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్ల ధాటికి 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు కీలకమైన వికెట్లు తీసి ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. ఇక అవేష్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు చెరో రెండేసి, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ 1 చొప్పున వికెట్లు తీశారు. దీంతో 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 

ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టోనీ డీ జోర్జి మాత్రమే 81 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. హెండ్రిక్స్ (19), టోనీ డీ జోర్జి(81), డస్సెన్(2), మార్క్రమ్(36), క్లాసెన్(21), డేవిడ్ మిల్లర్(10), ముల్డర్(1), కేశవ్ మహారాజ్ (14), హెండ్రిక్స్(18), విలియమ్స్(2), బర్గర్(1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. కాగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా సంజూ శాంసన్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా అర్షదీప్ సింగ్ అవార్డులను అందుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. శాంసన్‌ సెంచరీ, యువ బ్యాటర్లు తిలక్ వర్మ(52), రింకూ సింగ్ (38) రాణించారు. 103 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ ఇన్నింగ్స్‌ను శాంసన్ చక్కదిద్దాడు. తిలక్ వర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

భారత బ్యాటింగ్..
రజత్ పటీదార్ (22), సాయి సుదర్శన్ (10), సంజూ శాంసన్ (108), కేఎల్ రాహుల్ (21), తిలక్ వర్మ (52), రింకూ సింగ్ (38), అక్షర్ పటేల్ (1), వాషింగ్టన్ సుందర్ (14), అర్షదీప్ సింగ్ (7 నాటౌట్), అవేశ్ ఖాన్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్లను ఆరంభంలో బాగానే కట్టడి చేశారు. వరుసగా విరామాల్లో కీలకమైన వికెట్లు తీశారు. అయితే సంజూ శాంసన్, తిలక్ వర్మ జాగ్రత్తగా ఆడడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు, నండ్రె బర్గర్ 2, విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.

సంజూ శాంసన్ తొలి సెంచరీ..
క్రికెట్ కెరీర్ ఆరంభమైన చాన్నాళ్ల తర్వాత సంజూ శాంసన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి ఇదే తొలి శతకం. శాంసన్ 114 బంతులను ఎదుర్కొని 108 పరుగులు సాధించాడు. ఇందులో 3 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.

Team India
India vs South Africa
3rd ODI
Cricket
Arshadeep singh
Sanju samson
  • Loading...

More Telugu News