Revanth Reddy: ప్రధాని మోదీని కలుస్తానని కిషన్ రెడ్డిని అడిగాను: రేవంత్ రెడ్డి

Revanth Reddy says he is ready to meet pm modi

  • శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి
  • పదేళ్లు తెలంగాణ కోసం పని చేసిన అధికారులను అవమానించేలా హరీశ్ రావు మాట్లాడారన్న సీఎం
  • బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్బీఐ వద్ద 303 రోజుల మిగులు నిధులు ఉంటే ఇప్పుడు 30 రోజులకు పడిపోయాయన్న రేవంత్ రెడ్డి

శ్వేతపత్రం విడుదలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదని, తాము ఎవరినీ నిందించే ప్రయత్నం చేయలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... పదేళ్లు తెలంగాణ కోసం పని చేసిన అధికారులను అవమానించేలా హరీశ్ రావు మాట్లాడారని విమర్శించారు. ప్రభుత్వం సరైన ఉద్దేశంతో నిధులను ఖర్చు చేసిందా? లేదా? అనేది కాగ్ చెబుతుందన్నారు. అయితే ఈ శ్వేతపత్రం మేమిచ్చిన హామీలను ఎగవేసేందుకు కాదని స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ఆర్బీఐ వద్ద 303 రోజుల మిగుల నిధులు ఉండేవని, ఈ పదేళ్లలో ఏకంగా ముప్పై రోజులకు పడిపోయాయన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణాలు పుట్టని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయం, అవసరాలకు సంబంధించి ఆర్బీఐ సమాచారం ఇస్తుందని తెలిపారు. ఆర్బీఐ, కాగ్ సమాచారం తీసుకున్నామన్నారు. శ్వేతపత్రంపై మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారని, కానీ తాము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమన్నారు.

సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు తాను కిషన్ రెడ్డిని అడిగానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మేం ఏం చేయాలనుకున్నా దానిని సభ ముందు పెడతామని హామీ ఇచ్చారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

Revanth Reddy
Harish Rao
G. Kishan Reddy
Congress
  • Loading...

More Telugu News