free bus: మహిళలు ఆటోలు ఎక్కడం తగ్గిపోయింది.. ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో మా ఆటోలను పెట్టుకోండి: బీఎంఎస్ ఆటో యూనియన్ డిమాండ్

BMS Ultimatum to government on Free bus to women

  • మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందన్న యూనియన్   
  • గతంలో రూ.1000 వచ్చేవి.. ఇప్పుడు రూ.300 కూడా రావడం లేదని ఆవేదన
  • వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని భారతీయ మజ్దూర్ సంఘ్-బీఎంఎస్ కు చెందిన ఆటో యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని శుక్రవారం వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం అంశంపై వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో డెబ్బై శాతం మంది మహిళలు ఆటోలు ఎక్కేవారని, దీంతో తమకు రోజుకు రూ.1000 వరకు వచ్చేవని, కానీ ఇప్పుడు మహిళలు ఆటోలు ఎక్కడం తగ్గడం వల్ల రూ.300 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉచిత పథకాలతో తమ పొట్టను కొట్టారని, కాబట్టి ఆటోలను ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పెట్టుకోవాలని లేదా బస్సుల సంఖ్య తగ్గించాలని కోరారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రవాణా చట్టానికి విరుద్ధంగా ఓల, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిందని విమర్శలు గుప్పించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యను పరిష్కరించాలని లేదంటే.. 18వ తేదీన ధర్నాలు, 19న కలెక్టర్లకు వినతి పత్రం సమర్పణ, 20న డిపోల వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ తర్వాత 21, 22 తేదీల్లో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆటో సంఘాలతో చర్చలు జరిపి న్యాయం చేయకుంటే ఛలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజా భవన్ ముట్టడిస్తామన్నారు. 

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడ్ వైట్ బైక్‌లకు అనుమతి ఇచ్చి ఆటో డ్రైవర్లను దెబ్బతీసిందన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో రాష్ట్రంలోని 8 లక్షల ఆటో డ్రైవర్ల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేశారని వాపోయారు. ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు.

free bus
Congress
bms
women
  • Loading...

More Telugu News