Cyclone Michaung: రేణిగుంట ఎయిర్ పోర్టు రన్ వే పైకి వరద నీరు.... విమాన రాకపోకల రద్దు

Flood water on Ranigunta airport runway

  • దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న తుపాను
  • తిరుపతి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు
  • రేణిగుంటలో భారీ వర్షాలు
  • ప్రజలను అప్రమత్తం చేస్తున్న జిల్లాల కలెక్టర్లు
  • నిజాంపట్నం హార్బర్ లో ఏడో నెంబరు ప్రమాద సూచిక

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను (మిగ్జామ్) కారణంగా ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షానికి తోడు, ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా, తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టులో రన్ వే పైకి వరద నీరు చేరింది. దాంతో రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేశారు. అధికారులు తుపాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కృష్ణా జిల్లాలోనూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తుపాను దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో తీర ప్రాంతాలు, బీచ్ లలోకి ప్రవేశం నిరాకరిస్తున్నారు. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సహాయ చర్యల కోసం 112, 100, 94910 68906, 83329 83792 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. 

కాగా, తుపాను నేపథ్యంలో 14 రక్షిత కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు బాపట్ల జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. తీర ప్రాంతంలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, సహాయ చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

తుపాను తీవ్రత నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్ వద్ద ఏడో నెంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు. హార్బర్ సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. 

అటు, కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. దాంతో కాకినాడ-ఉప్పాడ రోడ్డుపై రాకపోకలను అధికారులు నియంత్రిస్తున్నారు. తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండింగ్ ఆఫీసర్ వెల్లడించారు.

Cyclone Michaung
Renigunta Airport
Runway
Flood
Tirupati Districts
  • Loading...

More Telugu News