Rahul Gandhi: ఢిల్లీలో మోదీకి కేసీఆర్ సహకారం... తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకారం: రాహుల్ గాంధీ

Rahul Gandhi says brs is helping bjp in delhi

  • తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటున్నారని విమర్శ
  • తెలంగాణ ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపణ
  • ధరణి పోర్టల్‌ను గుప్పెట్లో పెట్టుకొని పేదల భూములను లాక్కున్నారని ఆగ్రహం

బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం ఉందని, ఢిల్లీలో నరేంద్రమోదీకి కేసీఆర్ సహకరిస్తారు... తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకరిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదివారం నాడు ఆందోల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఎన్నో కలలు.. ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కేవలం తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎనిమిది వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు.

ల్యాండ్.. శాండ్.. మైన్స్.. వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను గుప్పెట్లో పెట్టుకొని పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. పరీక్ష పేపర్లు లీక్ కావడం వల్ల ఎంతోమంది ఉద్యోగ అభ్యర్థులు నష్టపోయారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలపై తొలి కేబినెట్ సమావేశంలోనే సంతకం చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News