VV Lakshminarayana: వచ్చే ఎన్నికల్లో ఎక్కడ్నించి పోటీ చేసేదీ చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 

CBI Former JD Lakshminarayana talks about elections

  • గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ
  • లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ
  • ఈసారి కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని వెల్లడి
  • తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని స్పష్టీకరణ
  • సొంత ఆలోచనా విధానంతో ముందుకెళతానని వివరణ

గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ నుంచే బరిలో దిగుతానని చెప్పారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేసేదీ, లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా అనేది వెల్లడించలేదు. 

"ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉంది. నేను గత ఎన్నికల్లో పోటీ చేశాను... ఈసారి కూడా పోటీ చేస్తాను. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసినప్పుడు అక్కడి ప్రజల స్పందన బాగుంది. ఈసారి కూడా తప్పకుండా బరిలో ఉంటాను. 

యువత పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకోవాలని మనం చెబుతుంటాం. అందుకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. సరికొత్త రాజకీయాలు రావాలి. డబ్బుకు, ఇతర అంశాలకు ప్రాధాన్యత పెంచుకుంటూ పోతుంటే... రాజకీయాలు అంటే ఇవేనని యువత నిరుత్సాహానికి లోనవుతున్నారు. యువతపై సానుకూల ప్రభావం చూపే రాజకీయాల కోసం నేను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాను. 

అయితే ఇప్పటివరకు ఏ పార్టీ నన్ను ఆహ్వానించలేదు. నా ఆలోచనా విధానంతో ముందుకు వెళుతున్నాను. నేను ఆ పార్టీలో చేరుతున్నాను, ఈ పార్టీలో చేరుతున్నాను అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, వారిని ఈ సమాజంలో ఏ విధంగా భాగం చేయాలన్న విధానంలో నా పాత్రను నేను కచ్చితంగా పోషిస్తాను. 

ఏ పార్టీ అయినా ప్రజలను ఒప్పించగలిగినప్పుడే గెలుస్తుంది. ఏదేమైనా ప్రజలు బాగుండాలి, నిజమైన ప్రజాస్వామ్యం రావాలి. ప్రజల అభిప్రాయాలను అమలు చేసే ప్రభుత్వాలు రావాలే తప్ప సొంత ఆలోచనలను ప్రజల మీద రుద్దే ప్రభుత్వాలు రాకూడదు. ప్రజల అభిప్రాయాలే పాలనా పరమైన విధానాలుగా మారాలన్నది నా సిద్ధాంతం" అని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

VV Lakshminarayana
Visakhapatnam
Lok Sabha
Elections
CBI Former JD
  • Loading...

More Telugu News